కృష్ణా-గోదావరిలను కలిపేందుకు ఏపీ నుంచి ప్రతిపాదన వచ్చిందన్నారు సీఎం కేసీఆర్. శ్రీశైలాన్ని గోదావరి జలాలతో నింపేందుకు ఏపీ ప్రభుత్వం మొగ్గుచూపుతుందన్నారు. ఈసారి అదృష్టం బాగుండి కృష్ణా నదికి నీరు పుష్కలంగా చేరిందని, శ్రీశైలం ప్రాజెక్ట్ ద్వారా మహబూబ్నగర్, దక్షిణ నల్గొండ, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాలు సస్యశ్యామలమవుతాయని కేసీఆర్ తెలిపారు.
కాంగ్రెస్ కేసులు పెట్టడం వల్లే పాలమూరు ఎత్తిపోతల పథకం ఆలస్యమైందన్నారు కేసీఆర్. పాలమూరు కరువు జిల్లాగా మారడానికి, నీరు లభించకపోవడానికి, వలసల జిల్లాగా మారడానికి కారణం కాంగ్రెస్ నాయకులే అని మండిపడ్డారు. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ఏడాదిలోగా పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే పాలమూరు జిల్లాలో 15 నుంచి 18 లక్షల ఎకరాలకు నీరుందుతాయని చెప్పారు. పాలమూరు జిల్లాలను పాలుగారే జిల్లాగా మారుస్తామని హామీ ఇచ్చారు.