మాక్ డ్రిల్ కు సర్వం సిద్ధం.. సైరన్ మోగగానే గ్యాస్ స్టవ్ లు ఆపాలని సూచన
Operation Abhyas కాసేపట్లో హైదరాబాద్లోని నాలుగు ప్రాంతాల్లో డిఫెన్స్ మాక్ డ్రిల్ జరగనుంది.
Operation Abhyas: కాసేపట్లో హైదరాబాద్లోని నాలుగు ప్రాంతాల్లో డిఫెన్స్ మాక్ డ్రిల్ జరగనుంది. సికింద్రాబాద్, గోల్కొండ, కంచన్ బాగ్ డీఆర్డీఓ, మౌలాలి ఎన్ఎఫ్సీలో అధికారులు మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు. వైమానిక దాడి జరిగితే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆపరేషన్ అభ్యాస్ పేరుతో 12 సివిల్ డిఫెన్స్ సర్వీసెస్ అధికారులు అవగాహన కల్పించనున్నారు. ముందుగా హైదరాబాద్ నగరమంతటా అధికారులు సైరన్లు మోగించనున్నారు. ఔటర్ రింగ్రోడ్ లోపల హైదరాబాద్ సిటీ మొత్తం ఈ మాక్ డ్రిల్ నిర్వహిస్తారు.
అన్ని కూడళ్లు, పారిశ్రామిక ప్రాంతాల్లో సైరన్లు మోగిస్తారు. బంజారాహిల్స్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఉంటుంది. సైరన్ మోగగానే ప్రజలంతా బహిరంగ ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని, సమాచారం కోసం టీవీ, రేడియో, ప్రభుత్వం యాప్లను వినియోగించుకోవాలని ఇప్పటికే అధికారులు తెలిపారు. ఇంట్లో ఉన్నవారు ఎలక్ట్రిక్ పరికరాలు, లైట్లు, గ్యాస్ స్టవ్లు ఆపాలని సూచించారు.
4గంటల15నిమిషాలకు నగరంలోని నాలుగు చోట్ల మాక్ డ్రిల్ నిర్వహిస్తారు. పోలీసులు, ఫైర్, ఎన్డీఆర్ఎఫ్, వైద్య, రెవెన్యూ, స్థానిక అధికారులు ఆయా ప్రాంతాలకు 4గంటల20నిమిషాలోపు చేరుకోవాలి. నాలుగున్నర గంటలకు మాక్ డ్రిల్ పూర్తి కానుంది.
పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ - పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా సివిల్ మాక్ డ్రిల్స్ నిర్వహణకు కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. సరిగ్గా 54 ఏళ్ల క్రితం అంటే 1971లో భారత్-పాక్ మధ్య యుద్ధం జరిగింది. అప్పుడు మన దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహించారు. అంతకంటే ముందు 1962లో భారత్-చైనా యుద్ధం జరిగింది. అప్పుడు అసోంలో మాక్డ్రిల్ నిర్వహించారు. పహల్గాం ఉగ్రదాడి కారణంగా మళ్లీ ఇన్నాళ్లకు మాక్డ్రిల్నిర్వహిస్తున్నారు.