Fake Passport Case: భారత పౌరులుగా విదేశీయులకు పాస్పోర్టులు.. 93 మంది అరెస్టు
Fake Passport Case: ఈ కేసు దర్యాప్తు మరింత వేగవంతం
Fake Passport Case: భారత పౌరులుగా విదేశీయులకు పాస్పోర్టులు.. 93 మంది అరెస్టు
Fake Passport Case: నకిలీ డాక్యుమెంట్లతో విదేశీయులకు భారత పౌరులుగా పాస్పోర్టులు ఇప్పించి... గల్ఫ్ దేశాలకు పంపించిన కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి.. తెలంగాణ సీఐడీ దర్యాప్తులో నిందితుల కస్టడీ ముగియనుంది. ఇప్పటికే ఈ కేసులో 93 మందిని అరెస్ట్ చేశారు సీఐడీ పోలీసులు. నకిలీ డాక్యుమెంట్లతో పాస్పోర్టులు పొంది విదేశాలకు వెళ్లిన 92 మందికి లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. నిందితుల వివరాల కోసం విదేశాంగ శాఖకు లేఖ రాసింది తెలంగాణ సీఐడీ.
నకిలీ డాక్యుమెంట్లతో పాస్పోర్టులు పొందిన కుంభకోణం కేసు రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. ఈ కేసులో సీఐడీ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. విదేశాలకు చెందిన కొందరు నకీలీ పాస్ పోర్టులు పొంది.. ఇప్పటికే వేరే దేశాలకు వెళ్లిపోగా.మిగిలిపోయిన వారైనా దేశం దాటకుండా ఉండేందుకు సీఐడీ చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే దేశవ్యాప్తంగా అన్ని విమానాశ్రయాల్లోని అధికారులను అప్రమత్తం చేసి... మిగిలిన వారు దేశం దాటకుండా నిఘా పటిష్టం చేసింది సీఐడీ...
నకిలీ పత్రాలతో 93 మంది విదేశీయులు పాస్ పోర్టులు తీసుకున్నట్లు సీఐడీ గుర్తించింది. విజిటింగ్ వీసాలతో థాయిలాండ్, కెనడా, మలేషియా, ఇరాక్, దుబాయ్, స్పెయిన్, ఫ్రాన్స్ వెళ్లినట్లు వెల్లడించింది సీఐడీ. ఆయా దేశాల్లో భారతీయ పౌరులుగా విదేశీయులు చలామణి అవుతున్నారని పేర్కొంది. జగిత్యాల, ఫలక్నుమాలోని చిరునామాలతో ఎక్కువగా పాస్పోర్టులను తీసుకున్నారని దర్యాప్తులో గుర్తించినట్లు తెలిపింది. హైదరాబాద్, నిజామాబాద్, కరీంనగర్, జగిత్యాల, కోరుట్లలో జరిగిన ఈ దందా సీఐడీ దర్యాప్తులో బహిర్గతమైంది. నకిలీ పత్రాలతో పాస్పోర్టులను సృష్టించడం ద్వారా 93 మందిని భారతీయులుగా దేశం దాటించినట్లు వెల్లడైంది. వాళ్ల కోసం విదేశాంగ శాఖకు సీఐడీ లేఖ రాసింది.
తమిళనాడు రాష్ట్రానికి చెందిన ట్రావెల్ ఏజెంట్ మురళీధరన్.... హైదరాబాద్ సత్తార్... నకిలీ పత్రాలు సృష్టించారు.. ఇలా కోరుట్ల, జగిత్యాల, నిజామాబాద్, కరీంనగర్లో ఏజెంట్లను నియమించి... వారి ఫోన్ నంబర్లతో నిందితులకు పాస్పోర్టులు దరఖాస్తు చేయించారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే సుమోటోగా కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు సీఐడీ అధికారులు. తప్పుడు చిరునామాలు, నకిలీ ధృవీకరణ పత్రాలు వినియోగించి పాస్పోర్టులను పొందిన నేపథ్యంలో వాటిని రద్దు చేయాలని ప్రాంతీయ పాస్పోర్టు కార్యాలయానికి వివరాలు ఇచ్చారు సీఐడీ అధికారులు.
ఈ కేసులో కీలక నిందితుడు అబ్దుస్ సత్తార్ అల్ జవహరీ విదేశీయులకు నీలోఫర్ ఆస్పత్రి పేరు మీద నకిలీ ఆధార్, పాన్కార్డులు, నకిలీ జనన ధృవీకరణ పత్రాలను సృష్టించినట్లు పోలీసులు వెల్లడించారు. సాధారణంగా నిరక్షరాస్యులు ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశాలకు వెళ్లాలంటే ఇమిగ్రేషన్ చెక్ నాట్ రిక్వయిర్డ్ కేటగిరీ పాస్పోర్టు పొందాల్సి ఉంటుంది. ఈ తరహా పాస్పోర్టుతో వెళితే తక్కువస్థాయి ఉద్యోగం మాత్రమే లభించే అవకాశముంటుంది. ఈ నేపథ్యంలో ఈసీఎన్ఆర్ కేటగిరీని తప్పించుకునేందుకు పదో తరగతి నకిలీ మెమోలను ఈ ముఠా సృష్టిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ ముఠా గుట్టురట్టు చేసి కటకటాల్లోకి నెట్టారు పోలీసులు.. ఈ నేపథ్యంలో పాస్పోర్టు సేవా కేంద్రాల్లో తప్పుడు ధృవీకరణ పత్రాలతో సులభంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయ్యేందుకు ఏజెంట్లు స్పెషల్ బ్రాంచ్ పోలీసులకు లంచాలు ఇచ్చినట్లు సీఐడీ గుర్తించింది... ఈ కేసులో ఇద్దరు స్పెషల్ బ్రాంచ్ పోలీసులను అరెస్టు చేసింది... హైదరాబాద్, వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్ పాస్ పోర్టు సేవా కేంద్రాల్లో ఏజెంట్లు స్లాట్ బుక్ చేసినట్లు గుర్తించారు సీఐడీ అధికారులు.... ఈ కేసు దర్యాప్తును మరింత వేగవంతం చేస్తోంది సీఐడీ.