Anvesh: ప్రపంచ యాత్రికుడు అన్వేష్ పై కేసు నమోదు..!

Update: 2025-05-04 04:12 GMT

Anvesh: ప్రపంచ యాత్రలు చేస్తూ..తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా తెలుగు ప్రజలకు సుపరిచితులైన యూట్యూబర్ అన్వేష్ పై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. రాష్ట్ర ప్రభుత్వంలోని ఉన్నతాధికారులపై తీవ్ర ఆరోపణలు చేస్తూ అవాస్తవ సమాచారంతో కూడిన వీడియోను ప్రచారం చేశారనే ఆరోపణలపై పోలీసులు సమోటోగా ఈ కేసును స్వీకరించారు.

తెలంగాణ డీజీపీ జితేందర్, హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, సీనియర్ ఐఏఎస్ అధికారులు శాంతికుమారి, దానికిషోర్, వికాస్ రాజ్ తదితరులు హైదరాబాద్ మెట్రోలో బెట్టింగ్ యాప్స్ ప్రచారానికి అనుమతులు ఇచ్చే నెపంతో రూ. 300కోట్లు అక్రమంగా ఆర్జించారని ఆరోపిస్తూ అన్వేష్ తన యూట్యూబ్ ఛానెల్లో ఓ వీడియోను పోస్ట్ చేశాడు. ఈ వీడియోలో చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని..తప్పుడు సమాచారంతో కూడినవని సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు.

సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కు చెందిన ఓ కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. సదరు వీడియో ప్రజల్లో గందరగోళాన్ని స్రుష్టించే ఉద్దేశ్యంతో ఉందని ప్రభుత్వ అధికారులు, చట్టబద్ధమైన సంస్థల ప్రతిష్టను దెబ్బతీసేలా వారి పరువుకు భంగం కలిగించేలా ఉందని తమ ఫిర్యాదు లో పేర్కొన్నారు. అధికారుల విశ్వసనీయతను ప్రశ్నించేలా, ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత, ద్వేష భావాలను రెచ్చగొట్టేలా ఆ వీడియో ఉందని పోలీసులు అభిప్రాయం వ్యక్తం చేశారు. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసిన కంటెంట్ క్రియేటర్ అన్వేష్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తమ ఫిర్యాదులో కోరారు.

Tags:    

Similar News