తెలంగాణలో అధికారాన్ని కైవసం చేసుకోవాలని ఓ వైపు ఆ పార్టీ అధిష్టానం పావులు కదుపుతోంది. ఇటువంటి తరుణంలో పార్టీకి అసెంబ్లీలో బలమైన వాయిస్ వినిపించే నాయకుడు కరువయ్యాడు. ఒకప్పుడు అసెంబ్లీలో తమ పార్టీ వాణిని గట్టిగా వినిపించే నాయకులతో తమ ఉనికిని చాటుకున్న ఆ పార్టీకి ఇప్పుడు గొంతెత్తే నాయకుడు కరువయ్యాడు.
ప్రజల సమస్యలపై గొంతెత్తాల్సిన చోట ఆ పార్టీ తడబడుతోంది. గతంలో ఆ పార్టీ నుండి తక్కువ సంఖ్యలో ఎం.ఎల్. ఏలు ఎన్నికైనా పార్టీ వాయిస్ను సమర్థవంతగా వినిపించే నాయకులే. అదే భారతీయ జనతాపార్టీ. ఆ పార్టీ ప్రస్తుతం అసెంబ్లీలో ఒక్క సీటుకే పరిమితమైంది. మొన్నటి లోక్ సభ ఎన్నికల్లో నాలుగు సీట్లు సాధించి ఫుల్ జోష్ మీద ఉంది. అటు బీజేపీ అధిష్టానం కూడా తెలంగాణ లో పాగా వేసేందుకు ఇదే సరైన సమయమంటూ వేగంగా పావులు కదుపుతోంది.
ప్రజావ్యతిరేక విధానాలపై ఎప్పటికప్పుడు అధికారపార్టీని నిలదీయాలని ప్రభత్వంపై ఎదురుదాడికి సిద్ధం కావాలని పార్టీ జాతీయ నాయకత్వం ఆదేశించింది. ఈ సమయంలో ఏ ఒక్క అంశాన్నీ వదలకుండా ఆ పార్టీ నాయకులు దూకుడు పెంచారు. కానీ ప్రజల సమస్యలపై పార్టీ గొంతుకను బలంగా వినిపించాల్సిన అసెంబ్లీలో ఆ పార్టీ మరీ బలహీనంగా ఉంది. అసెంబ్లీలో ఉన్న ఒక్క ఎం.ఎల్. ఏ రాజా సింగ్కు తెలుగు సరిగ్గా రాకపోవటం పెద్ద సమస్యగా మారింది
ప్రజా సమస్యలపై అనర్గళంగా మాట్లాడగలిగి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టగలిగితేనే పార్టీకి ప్రజల్లో మరింత ఆదరణ పెరిగేది. కానీ రాజా సింగ్ తనకు వచ్చిన తెలుగులో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నా అది ఆకర్షించే స్థాయిలో ఉండట్లేదు. ఇక హిందీలో ప్రభుత్వానికి చురకలు అంటిస్తున్నా దాని వల్ల పెద్దగా ప్రయోజనం కనపడడం లేదు. హిందీ మాట్లాడే తన నియోజకవర్గ ప్రజలను మెప్పించగలడేమో కానీ రాష్ట్రంలో ఇతర ప్రాంత ప్రజలని ఆకట్టుకునే విధంగా రాజాసింగ్ ప్రసంగాలు లేవని ఆ పార్టీ నాయకులే చర్చించుకుంటున్నారు.
తెలుగుపై పట్టు పెంచుకునేలా ప్రయత్నం చేయాలని రాజాసింగ్కు కొందరు సూచిస్తున్నారు. ఏదేమైనా కీలకమైన సమయంలో అసెంబ్లీలో బలమైన వాయిస్ వినిపించే నాయకుడు లేకపోవటం పార్టీకి కొంత మైనస్సే అన్న అభిప్రాయాలను పార్టీలో కొందరు నాయకులు వ్యక్తం చేస్తున్నారు.