CWC Meet at Hyderabad: CWC భేటీకి సర్వం సిద్ధం.. 17న 'విజయభేరి' సభ
Congress: వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి రూట్ మ్యాప్
CWC Meet at Hyderabad: CWC భేటీకి సర్వం సిద్ధం.. 17న 'విజయభేరి' సభ
Congress: హైదరాబాద్లో నేటి నుంచి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలు జరగనున్నాయి. తాజ్కృష్ణ హోటల్లో ఇవాళ, రేపు భేటీలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో కాంగ్రెస్ అగ్రనేతలు పాల్గొననున్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లన్నీ ఇప్పటికే పూర్తి చేశారు. ఈ రోజు మధ్యాహ్నం CWC సభ్యులకు టీపీసీసీ విందు ఇవ్వనుంది. విందు అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆదివారం సమావేశం అనంతరం బహిరంగ సభ నిర్వహించున్నారు. CWC సమావేశాల్లో 5 కీలక అంశాలపై కాంగ్రెస్ పార్టీ చర్చించే అవకాశం ఉంది. తెలంగాణతో పాటు త్వరలో ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి.
ఈ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంతో పాటు, భారత్ జోడో యాత్ర-2 నిర్వహణ, 2024 లోక్సభ ఎన్నికలు, ఇండియా కూటమిలో పార్టీల మధ్య సీట్ల కేటాయింపుపై చర్చించున్నారు. ముఖ్యంగా సోమవారం నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో అనుసరించాల్సి వ్యూహాలపై కూడా చర్చించనున్నారు. అలాగే దేశంలో పెరగుతోన్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, ఇండియా కూటమిలో లేని ప్రాంతీయ పార్టీలను ఎలా ఎదుర్కొవాలనే దానిపై కూడా చర్చించే అవకాశం ఉంది.
ఈసారి తెలంగాణలో కాంగ్రెస్ అధికారం దక్కేలా ప్రణాళికపై కూడా చర్చలు జరపనున్నారు. కొద్ది నెలల్లో తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మిజోరంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణ ఎన్నికలే టార్గెట్గా CWC సమావేశాలు హైదరాబాద్లో నిర్వహించాలని అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ క్రమంగా బలపడుతోంది. ఈ క్రమంలో ఇక్కడ CWC సమావేశాలు నిర్వహించడం వల్ల పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నిండనుంది. ఈ CWC సమావేశంలో సాధారణ సభ్యులతో పాటు శాశ్వత, ప్రత్యేక ఆహ్వానితులు కలిపి మొత్తం 84 మంది పాల్గొనున్నట్లు సమాచారం.
ఇప్పటికే 52 మంది హైదరాబాద్కు చేరుకున్నారు. వీరిలో హిమాచల్ప్రదేశ్ సీఎం సుఖ్విందర్సింగ్, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, సీడబ్ల్యూసీ సభ్యులు కేసీ వేణుగోపాల్, జైరాం రమేశ్, ఏకే ఆంటోనీ, రమేశ్ చెన్నితాల, కొడుక్కునిల్ సురేశ్, శశిథరూర్, రణదీప్సింగ్ సూర్జేవాలా, రాజీవ్శుక్లా, పవన్ఖేరా, యశోమతి ఠాకూర్, దీపేందర్ సింగ్ హుడా, ఫూలోదేవి, లాల్జీదేశాయ్, తారిఖ్ అన్వర్, మీరా కుమార్, నెట్టా డిసౌజా, అల్కా లాంబా, బీకే హరిప్రసాద్, మాణిక్యం ఠాగూర్, ఇబోబిసింగ్, ప్రతిభాసింగ్, మనీశ్ తివారీ, గౌరవ్ గొగోయ్, భక్తచరణ్దాస్, సుప్రియా షినాటె, దిగ్విజయ్సింగ్, కుమారి షెల్జా ఉన్నారు. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతోపాటు సోనియా, రాహుల్, ప్రియాంకాగాంధీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు అశోక్ గెహ్లాట్, సిద్ధరామయ్య, భూపేశ్ భగేల్, మరికొందరు నేతలు ఈ రోజు రానున్నారు.
17న సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ శివార్లలోని తుక్కుగూడలో కాంగ్రెస్ 'విజయభేరి' బహిరంగ సభ జరగనుంది. సోనియా, రాహుల్, ప్రియాంక, ఖర్గేలతోపాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు, సీడబ్ల్యూసీ సభ్యులు, పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలు సభకు హాజరవుతారు.