నల్లగొండ జాతరకు సర్వం సిద్ధం
స్వామివారికి కోరమీసాల మొక్కులు ప్రతియేటా చెల్లిస్తే మంచి జరుగుతుందని భక్తుల విశ్వాసం.
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని నల్లగొండ గ్రామం లో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడై భక్తుల పాలిట కల్పతరువై కోరిన కోర్కెలు తీర్చే శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రతి సంవత్సరం మాఘ మాస శుద్ధ పౌర్ణమి సందర్భంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ ఏడాది బ్రహ్మోత్సవాలకు వచ్చేటువంటి భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు ఆలయ ఈవో కాంతారెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 5 నుండి ఫిబ్రవరి 9వ తేదీ వరకు కొనసాగుతాయని బుధవారం రోజున పుణ్యవచనం, ఋత్విక వరణం, పూజలు, గురువారం ఆరాధన, ధ్వజారోహణం, బలి హారణం, శుక్రవారం రోజున స్వామి వారి కళ్యాణం, శనివారం స్వామివారి ఊరేగింపు, ఆదివారం సాయంత్రం రథోత్సవం మొదలగు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని భక్తులు అధిక సంఖ్యలో సందర్శించుకొని మొక్కులు చెల్లించుకొని స్వామి వారి కృపకు పాత్రులయ్యి తీర్థ ప్రసాదాలు స్వీకరించగలరని ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త చెన్నాడి సత్యనారాయణ రావు తెలిపారు.స్వామివారికి కోరమీసాల మొక్కులు ప్రతియేటా చెల్లిస్తే మంచి జరుగుతుందని భక్తుల విశ్వాసం.
నల్లగొండ గుట్ట కింది దేవాలయంతో పాటు గుట్ట పైన వెలసిన దేవాలయం కూడా చరిత్రలో ప్రసిద్ధికెక్కింది. గుట్టపైన కోనేరులో నీళ్లు ఎప్పటికీ ఉండడం అధ్యాత్మిక విశేషమని ఇక్కడి ప్రజలు అనుకుంటారు. ఇక్కడ స్వామి వారిని సందర్శించి కోరికలు కోరినట్లయితే వారి కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం అందుకని ఈ నల్లగొండ జాతరకు జిల్లా కేంద్రంతో పాటు అనేక జిల్లాల నుండి అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. ఈ సంవత్సరం సమ్మక్క సారక్క జాతర జరుగుతున్న నేపథ్యంలో వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయం, కొండగట్టు దేవాలయం మధ్యలో ఉన్నటువంటి ఈ నల్లగొండ దేవాలయానికి ఈ సంవత్సరం అధిక సంఖ్యలో భక్తులు హాజరవుతారు.
ఈ జాతరను పురస్కరించుకొని ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని పూర్తి చేశామని.. ముఖ్యంగా వేములవాడ, జగిత్యాల ఆర్టీసీ డిపోల నుండి ప్రత్యేక బస్సులు నడుస్తాయని, విద్యుత్, వైద్య సదుపాయాలు కల్పించడం జరిగిందని. పరిసరాలను పరిశుభ్రంగా ఉండేటట్లు తగిన చర్యలు తీసుకున్నామని, తెలిపారు జాతర సమయంలో రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలలో మఫ్టీలో పోలీసు వారి సేవలు వినియోగించుకోవడం జరుగుతుందని, ఘాట్ రోడ్డు పైన 2 ఎకరాల పార్కింగ్ స్థలానికి, కొండపైన ఆలయ పునర్నిర్మాణం, గట్టు క్రింద భక్తుల సౌకర్యం కొరకు గదుల నిర్మాణం కొరకు దాతలు విరాళాలు ఇవ్వాల్సిందిగా ఈఓ కోరారు. నలు దిక్కుల ప్రజలు నల్లగొండ స్వామి వారిని సందర్శించి ఆధ్యాత్మికతను పెంచుకొని మొక్కులు చెల్లించి సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని నిర్వాహకులు కోరారు.