Telangana: తెలంగాణలో మండిపోతున్న ఎండలు.. ఆ జిల్లాకు రెడ్ అలర్ట్
Telangana: తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న భానుడి భగభగలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంట్లో నుంచి బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఈ క్రమంలో వాతావరణ శాఖ ప్రజలు అప్రమత్తం చేస్తోంది. అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్న జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ చేస్తోంది. గురువారం రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. రాష్ట్ర వ్యాప్ంగా ఉన్న అన్ని జిల్లాలతో పోలిస్తే ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా 45.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయినట్లు తెలుస్తోంది. దీంతో ఆదిలాబాద్ జిల్లాకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం రెడ్ అలర్ట్ జారీ చేసింది. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా ఆదిలాబాద్ మినహా అన్ని జిల్లాల్లోనూ 42 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదు అయినట్లు తెలుస్తోంది.
అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అయిన ఆదిలాబాద్ జిల్లా మినహా మిగతా జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. గాలిలో తగ్గుతున్న తేమ, వేడి గాలుల వలన ఉక్కపోతతో పాటు, రాత్రిపూట ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. రానున్న మూడు రోజుల్లో ఉష్ణోగ్రతల్లో మార్పులు పెద్దగా ఉండకపోవచ్చని అధికారులు చెబుతున్నారు. ఇదెలా ఉండగా గత రెండు రోజుల్లో హైదరాబాద్ సహా రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో ఒక్కసారిగా వాతావరణం మారింది. నగరవాసులపై ఉదయం నుంచి భానుడు తన విశ్వరూపాన్ని చూపిస్తున్నాడు. సాయంత్రం చల్లని వాతావరణంతో ఉపశమనం కల్పిస్తున్నాడు. హైదరాబాద్ సహాకొన్ని జిల్లాల్లో బుధవారం నుంచి గురువారం మధ్య ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిశాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక రానున్న వారం రోజుల్లో కూడా రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.