WTC Final 2025: ట్రావిస్ హెడ్ ఐసీసీ ఫైనల్స్లో రోహిత్ శర్మను అధిగమించి చరిత్ర సృష్టించాడు!
2025 డబ్ల్యూటీసీ ఫైనల్లో ట్రవిస్ హెడ్ రోహిత్ శర్మ రికార్డు బద్దలు కొట్టి ఐసీసీ ఫైనల్స్లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. కోహ్లి రికార్డును అధిగమించే దిశగా ముందంజలో ఉన్న హెడ్ ఘనతపై పూర్తి సమాచారం.
WTC Final 2025: ట్రావిస్ హెడ్ ఐసీసీ ఫైనల్స్లో రోహిత్ శర్మను అధిగమించి చరిత్ర సృష్టించాడు!
లార్డ్స్ వేదికగా జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్ 2025లో ఆసీస్ స్టార్ బ్యాట్స్మన్ ట్రావిస్ హెడ్ తన పేరు ఓ విశిష్ట రికార్డు నమోదు చేసుకున్నాడు. ఈ మ్యాచ్లో మొదటి ఇన్నింగ్స్లో కేవలం 11 పరుగులకే పెవిలియన్కు వెళ్లినా, అతడు ఓ మైలురాయిని అధిగమించాడు. ఐసీసీ ఫైనల్స్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానంలో ఉన్న రోహిత్ శర్మను అధిగమించి ఆ స్థానం తానే సొంతం చేసుకున్నాడు.
రోహిత్ శర్మ 11 ఇన్నింగ్స్లలో 322 పరుగులు చేసినప్పటికీ, ట్రావిస్ హెడ్ కేవలం 4 ఇన్నింగ్స్లలోనే 329 పరుగులు చేసి ఈ ఘనతను అందుకున్నాడు. ప్రస్తుతం ఐసీసీ ఫైనల్స్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లి. ఆయన 11 ఇన్నింగ్స్ల్లో 411 పరుగులు చేశారు.
ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ మ్యాచ్కు ముందు నుంచే హెడ్ దృష్టి విరాట్ రికార్డు మీదే ఉంది. తొలి ఇన్నింగ్స్లో విఫలమైన అతడికి రెండో ఇన్నింగ్స్లో ఆల్టైమ్ రికార్డు చెరిపేసే అవకాశం ఉన్నది. అతడు 83 పరుగులు చేస్తే, విరాట్ పేరిట ఉన్న ఐసీసీ ఫైనల్స్ అత్యధిక పరుగుల రికార్డు బద్దలు కావడం ఖాయం.
ఐసీసీ ఫైనల్స్లో ట్రావిస్ హెడ్కు ఘనమైన రికార్డు – ఆసీస్, సఫారీల మధ్య వన్డే తరహా పోరాటం
ట్రావిస్ హెడ్ ఐసీసీ ఫైనల్స్లో తనకంటూ ఓ గౌరవప్రదమైన ట్రాక్ రికార్డును నెలకొల్పాడు. 2021-23 డబ్ల్యూటీసీ ఫైనల్లో మొదటి ఇన్నింగ్స్లో 163 పరుగులు, రెండో ఇన్నింగ్స్లో 18 పరుగులు చేసిన అతడు, 2023 వన్డే వరల్డ్కప్ ఫైనల్లో భారత్పై 137 పరుగులతో సెంచరీ బాదాడు. తాజా 2023-25 డబ్ల్యూటీసీ ఫైనల్లో కూడా భారత్ లేని పోరులో తొలి ఇన్నింగ్స్లో 11 పరుగులు చేశాడు. విశేషమేమిటంటే, హెడ్ చేసిన రెండు సెంచరీలు రెండింట్లోనూ భారత్పైనే నమోదయ్యాయి. కాగా, ఈ సారి టీమిండియా ఫైనల్కు అర్హత సాధించకుండా మూడో స్థానంతో సరిపెట్టుకుంది.
ఆసీస్కు కష్టాలు – స్మిత్, వెబ్స్టర్ ధైర్యం
లార్డ్స్ వేదికగా జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన ఆస్ట్రేలియా 56.4 ఓవర్లలో 212 పరుగులకే కుప్పకూలింది. దక్షిణాఫ్రికా బౌలర్లు రబాడ (5/51), జన్సెన్ (3/49), మహారాజ్ (1/19), మార్క్రమ్ (1/5) అద్భుతంగా రాణించారు. 67 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియాకు స్టీవ్ స్మిత్ (66), బ్యూ వెబ్స్టర్ (72) అర్ధ సెంచరీలతో ఊపిరి పెట్టారు. వీరిద్దరూ ఐదో వికెట్కు 79 పరుగులు జోడించి గౌరవప్రదమైన స్కోర్ దిశగా దోహదపడ్డారు.అయితే వీరిద్దరూ అవుటయ్యాక ఆసీస్ మరోసారి క్రమంగా కుప్పకూలింది. మధ్యలో అలెక్స్ క్యారీ (23) కొంత పోరాడినప్పటికీ అతడి సహకారం ఎక్కువసేపు నిలకడగా నిలబడలేకపోయింది.
టాప్ ఆర్డర్ విఫలం – బౌలర్ల ధాటికి తడబడిన ఆసీస్
ఆస్ట్రేలియా బ్యాటింగ్లో స్మిత్, వెబ్స్టర్, క్యారీతో పాటు లబూషేన్ (17), ట్రావిస్ హెడ్ (11) మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగారు. ఓపెనర్ ఉస్మాన్ ఖ్వాజా 20 బంతుల్లో డకౌట్ కావడంతో ఆస్ట్రేలియా పతనం ఆరంభమైంది. ఖ్వాజాకు జోడీగా లబూషేన్తో ఓపెనింగ్ ప్రయోగం విజయవంతం కాలేదు. రబాడ్, జన్సెన్ తమ అద్భుతమైన బౌలింగ్తో టాప్ ఆర్డర్ను కుదిపేశారు.
సఫారీలకు భారీ లక్ష్యం – తొలితర్వాతే కష్టాలు
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ అనంతరం బ్యాటింగ్కు దిగిన దక్షిణాఫ్రికా తొలి ఓవర్ నుంచే కష్టాల్లో పడింది. స్టార్క్ తొలి ఓవర్లోనే మార్క్రమ్ను డకౌట్ చేశాడు. 19 పరుగుల వద్ద ర్యాన్ రికెల్టన్ (16)ను కూడా స్టార్క్ పెవిలియన్కు పంపాడు. వన్డౌన్ ముల్దర్ (6)ను కమిన్స్ ఔట్ చేయగా, స్టబ్స్ (2)ను హాజిల్వుడ్ పెవిలియన్ చేర్చాడు.ప్రస్తుతం సౌతాఫ్రికా 43/4తో తొలి ఇన్నింగ్స్ కొనసాగిస్తుండగా, ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోరు 212కి ఇంకా 169 పరుగుల వెనుకబడి ఉంది. ప్రస్తుతం బవుమా, బెడింగ్హమ్ క్రీజులో ఉండగా... సఫారీ జట్టు పతనాన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత వారి భుజాలపై ఉంది.