T20 World Cup 2026: టీ20 ప్రపంచకప్లో భారత సంతతి హవా.. విదేశీ జట్ల తరఫున బరిలోకి 40 మంది!
టీ20 ప్రపంచకప్ 2026కి వేళయింది. భారత్, శ్రీలంక వేదికలుగా మెగా టోర్నీ ఈరోజు నుంచి ఆరంభం కానుంది. నెల రోజుల పాటి పొట్టి కప్ మ్యాచులు అభిమానులను అలరించనున్నాయి.
T20 World Cup 2026: టీ20 ప్రపంచకప్లో భారత సంతతి హవా.. విదేశీ జట్ల తరఫున బరిలోకి 40 మంది!
టీ20 ప్రపంచకప్ 2026కి వేళయింది. భారత్, శ్రీలంక వేదికలుగా మెగా టోర్నీ ఈరోజు నుంచి ఆరంభం కానుంది. నెల రోజుల పాటి పొట్టి కప్ మ్యాచులు అభిమానులను అలరించనున్నాయి. ఈరోజు భారత్ తన మొదటి మ్యాచులో అమెరికాను ఢీకొట్టనుంది. మెగా టోర్నీ ఆరంభం కానున్న నేపథ్యంలో ప్రపంచకప్లో భారత సంతతికి చెందిన ఆటగాళ్లు ప్రత్యేక ఆకర్షణగా మారనున్నారు. భారత్ జట్టుతో పాటు.. ఇతర దేశాల తరఫున ఆడుతున్న భారత మూలాలున్న క్రికెటర్లు పెద్ద సంఖ్యలో టోర్నీలో పాల్గొనడం విశేషం. మొత్తం 40 మంది భారత సంతతి ఆటగాళ్లు వివిధ దేశాల జట్లకు ప్రాతినిధ్యం వహిస్తూ ప్రపంచకప్లో బరిలోకి దిగనున్నారు.
కెనడాలో అత్యధికంగా 11 మంది:
భారత సంతతి ఆటగాళ్లు అత్యధికంగా ఉన్న జట్టు కెనడా. ఈ జట్టులో ఏకంగా 11 మంది భారత మూలాలున్న క్రికెటర్లు ఉండటం విశేషం. క్రికెట్ వేగంగా విస్తరిస్తున్న దేశాల్లో కెనడా ఒకటిగా మారుతుండగా.. అందులో భారత సంతతి ఆటగాళ్లు కీలక పాత్ర పోషిస్తున్నారు.
అమెరికా, ఒమన్, యూఏఈలోనూ ప్రాతినిధ్యం:
అమెరికా జట్టులో 9 మంది, ఒమన్లో 7 మంది, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) జట్టులో 7 మంది భారత సంతతి ఆటగాళ్లు ఉన్నారు. ముఖ్యంగా అమెరికా, ఒమన్ జట్లు ఇటీవలి కాలంలో అంతర్జాతీయ క్రికెట్లో మెరుగైన ప్రదర్శన చేస్తుండటంలో భారత మూలాలున్న ఆటగాళ్ల పాత్ర కీలకంగా మారింది.
ఆసియా, ఉత్తర అమెరికాకే పరిమితం కాదు:
న్యూజిలాండ్కు 2 ఇద్దరు ప్లేయర్స్ ఆడుతున్నారు. దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, ఇటలీ, నెదర్లాండ్స్ జట్లలో ఒక్కో ఆటగాడు భారత మూలాల నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇది ప్రపంచ క్రికెట్లో భారత సంతతి ప్రభావం ఎంతలా ఉందో చూపిస్తోంది.
కెప్టెన్సీ కూడా భారత మనోళ్ల చేతుల్లోనే:
ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.. కెనడా, అమెరికా, ఒమన్ జట్లకు సారథులుగా కూడా భారత సంతతి ఆటగాళ్లే వ్యవహరించడం. ఇది భారత క్రికెట్ సంస్కృతి, శిక్షణ విధానం ప్రపంచవ్యాప్తంగా ఎంత ప్రభావం చూపుతుందో చెప్పే గొప్ప ఉదాహరణగా నిలుస్తోంది.
మొత్తంగా చూస్తే.. టీ20 ప్రపంచకప్ 2026లో భారత సంతతి ఆటగాళ్లు ప్రపంచ క్రికెట్లో కీలక శక్తిగా ఎదిగారు. భారత్ తరఫున మాత్రమే కాకుండా.. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల జట్లకు నాయకత్వం వహిస్తూ, ఆటతో పాటు అనుభవాన్ని పంచుకుంటూ టోర్నీకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు.