IND vs NZ : టీమిండియాకు కోలుకోలేని దెబ్బ..కివీస్తో వన్డే సిరీస్ నుంచి స్టార్ ప్లేయర్ అవుట్
IND vs NZ : న్యూజిలాండ్తో ప్రారంభం కానున్న కీలకమైన వన్డే సిరీస్కు ముందు భారత క్రికెట్ జట్టుకు భారీ షాక్ తగిలింది.
IND vs NZ : న్యూజిలాండ్తో ప్రారంభం కానున్న కీలకమైన వన్డే సిరీస్కు ముందు భారత క్రికెట్ జట్టుకు భారీ షాక్ తగిలింది. టీమ్ ఇండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ గాయం కారణంగా ఈ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. మ్యాచ్ ప్రారంభానికి కేవలం ఒక్క రోజు ముందు జరిగిన ఈ పరిణామం అటు జట్టు యాజమాన్యాన్ని, ఇటు అభిమానులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. గత కొంతకాలంగా గాయాలతో సతమతమవుతున్న పంత్, ఇప్పుడిప్పుడే గాడిలో పడుతున్నాడనుకున్న తరుణంలో మళ్లీ గాయపడటం అతని కెరీర్కు పెద్ద అడ్డంకిగా మారింది.
నెట్స్ లో ఏం జరిగింది?
శనివారం వడోదరలోని బరోడా క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో భారత జట్టు ఆప్షనల్ ప్రాక్టీస్ సెషన్ నిర్వహించింది. ఈ సమయంలో రిషబ్ పంత్ థ్రో-డౌన్ స్పెషలిస్టుల బౌలింగ్లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. అయితే ఒక వేగవంతమైన బంతి అనూహ్యంగా బౌన్స్ అయ్యి నేరుగా పంత్ నడుము పైభాగంలో బలంగా తగిలింది. బంతి తగిలిన వెంటనే పంత్ తీవ్ర నొప్పితో విలవిలలాడాడు. వెంటనే ఫిజియోలు మైదానంలోకి వచ్చి ప్రాథమిక చికిత్స అందించినప్పటికీ, నొప్పి తగ్గకపోవడంతో అతను మైదానాన్ని వీడాల్సి వచ్చింది.
సిరీస్ నుంచి నిష్క్రమణ..
మొదట ఈ గాయం చిన్నదే అని అందరూ భావించినప్పటికీ, తాజా రిపోర్టుల ప్రకారం పంత్ ఈ మూడు వన్డేల సిరీస్లో పాల్గొనడం లేదని సమాచారం. క్రికబజ్ నివేదిక ప్రకారం, గాయం తీవ్రత దృష్ట్యా అతనికి విశ్రాంతి అవసరమని వైద్య బృందం సూచించింది. ప్రస్తుతం వన్డే జట్టులో కెఎల్ రాహుల్ మెయిన్ వికెట్ కీపర్గా ఉన్నందున, తక్షణమే రీప్లేస్మెంట్ అవసరం లేకపోయినప్పటికీ, పంత్ వంటి మ్యాచ్ విన్నర్ అందుబాటులో లేకపోవడం జట్టుకు లోటే. త్వరలోనే సెలెక్టర్లు పంత్ స్థానంలో మరొక ఆటగాడిని ప్రకటించే అవకాశం ఉంది.
వెన్నాడుతున్న గాయాలు
రిషబ్ పంత్ ఫిట్నెస్ సమస్యలు అతడిని నీడలా వెంటాడుతున్నాయి. 2025లో ఇంగ్లాండ్ పర్యటనలో కూడా మాంచెస్టర్ టెస్ట్ సమయంలో కాలి గాయంతో సిరీస్ మధ్యలోనే తప్పుకున్నాడు. ఆ తర్వాత సుదీర్ఘ కాలం క్రికెట్కు దూరమై, దక్షిణాఫ్రికా సిరీస్తో మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు. ఇప్పుడు న్యూజిలాండ్ సిరీస్ ద్వారా తన సత్తా చాటాలని పట్టుదలతో ఉన్న సమయంలో మళ్ళీ గాయపడటం పంత్ దురదృష్టమనే చెప్పాలి. ముఖ్యంగా 2026 టీ20 వరల్డ్ కప్ దగ్గర పడుతున్న వేళ, పంత్ ఇలా పదే పదే గాయపడటం టీమ్ ఇండియా మేనేజ్మెంట్ను కలవరపెడుతోంది.
ఇషాన్ కిషన్కు పిలుపు?
పంత్ అందుబాటులో లేకపోవడంతో, అతని స్థానంలో యువ సంచలనం ఇషాన్ కిషన్ను వన్డే జట్టులోకి తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే కిషన్ కివీస్తో జరగబోయే టీ20 సిరీస్లో సభ్యుడిగా ఉన్నాడు. గత కొన్ని మ్యాచులుగా ఇషాన్ అద్భుతమైన ఫామ్లో ఉండటం, టీ20 వరల్డ్ కప్ 2026 జట్టులో కూడా చోటు సంపాదించడంతో సెలెక్టర్లు అతని వైపే మొగ్గు చూపే అవకాశం ఉంది. రాహుల్ వికెట్ కీపింగ్ బాధ్యతలు చేపడితే, కిషన్ కేవలం బ్యాటర్గా లేదా బ్యాకప్ కీపర్గా జట్టులో కొనసాగుతాడు.