Asia Cup 2025: ప్రభుత్వం చెప్పినట్లు వినాలి.. భారత్-పాకిస్తాన్ మ్యాచ్పై షమీ కామెంట్స్
Asia Cup 2025: ఆసియా కప్ 2025 సెప్టెంబర్ 9 నుండి 28 వరకు యూఏఈలో జరగనుంది. ఈ టోర్నమెంట్లో 8 జట్లు పాల్గొనబోతున్నాయి.
Asia Cup 2025: ఆసియా కప్ 2025 సెప్టెంబర్ 9 నుండి 28 వరకు యూఏఈలో జరగనుంది. ఈ టోర్నమెంట్లో 8 జట్లు పాల్గొనబోతున్నాయి. ఇందులో భారత్, పాకిస్తాన్ జట్లు ఒకే గ్రూప్లో ఉన్నాయి. సెప్టెంబర్ 14న దుబాయ్లో ఈ రెండు జట్లు తలపడనున్నాయి. ఇటీవల జరిగిన పహల్గామ్ ఉగ్రవాద దాడిలో 26 మంది పౌరులు చనిపోయిన నేపథ్యంలో, ఈ మ్యాచ్పై మరింత ఉత్కంఠ నెలకొంది. ఈ దాడికి భారత్ ఆపరేషన్ సింధూర్ ద్వారా సైనిక చర్యతో బదులిచ్చింది. ఈ నేపథ్యంలో భారత్, పాకిస్తాన్ మధ్య జరగనున్న ఈ తొలి మ్యాచ్పై టీమ్ ఇండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ కీలక వ్యాఖ్యలు చేశారు.
టీమిండియా పాకిస్తాన్తో మ్యాచ్ ఆడాలా వద్దా అని న్యూస్24కి ఇచ్చిన ఇంటర్వ్యూలో షమీని అడిగారు. దీనికి షమీ స్పందిస్తూ.. "ప్రభుత్వం, క్రికెట్ బోర్డు ఏది చెబితే అదే చేయాలి. భావోద్వేగాలతో ఆటలు ఆడకూడదు. ఎందుకంటే చాలా విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి. అందరూ సిద్ధంగా ఉన్నప్పుడు మ్యాచ్ ఆడాలి, ఆడటం కూడా అవసరం" అని అన్నారు.
భారత్-పాకిస్తాన్ మ్యాచ్పై ఒత్తిడి గురించి షమీ మాట్లాడుతూ.. "నాకు మిగతా మ్యాచ్ల మాదిరిగానే అనిపిస్తుంది. కానీ అభిమానుల్లో మాత్రం ప్రత్యేక ఉత్సాహం ఉంటుంది. అది ఆటగాళ్లలో కూడా ఉత్సాహాన్ని నింపుతుంది. అప్పుడు ఆడటానికి మరింత ఆనందంగా ఉంటుంది" అని తెలిపారు.
భారత ప్రభుత్వం ఇటీవల మల్టీనేషనల్ టోర్నమెంట్లలో పాకిస్తాన్తో ఆడటానికి అనుమతి ఇచ్చింది. అయితే, ఇప్పటికీ కొందరు ఈ మ్యాచ్ను వ్యతిరేకిస్తున్నారు. మాజీ క్రికెటర్లైన హర్భజన్ సింగ్, కేదార్ జాదవ్ ఈ మ్యాచ్ను బహిష్కరించాలని సూచించారు. ఇటీవల వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్లో ఆడిన హర్భజన్, పాకిస్తాన్తో మ్యాచ్ ఆడటానికి నిరాకరించాడు. అదేవిధంగా కేదార్ జాదవ్ కూడా భారత్ ఈ మ్యాచ్ ఆడకూడదని అన్నారు.