విశాఖ వైయస్ రాజశేఖర్ రెడ్డి క్రికెట్ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో ఢిల్లీ గెలిచింది. దీంతో సెమీస్ లో అడుగు పెట్టింది. కీలక మ్యాచ్ లో ఓటమి చెందడంతో హైదరాబాద్ ఇంటిదారిపట్టింది. ముందుగా బ్యాటింగుకు దిగిన హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. మార్టిన్ గప్టిల్ (19 బంతుల్లో 36; 1 ఫోర్, 4 సిక్సర్లు), మనీశ్ పాండే (36 బంతుల్లో 30; 3 ఫోర్లు), కెప్టెన్ విలియమ్సన్ (27 బంతుల్లో 28; 2 ఫోర్లు), విజయ్ శంకర్ (11 బంతుల్లో 25; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆగడంతో హైదరాబాద్ జట్టు 162 పరుగులు చేసింది. అనంతరం 163 పరుగుల విజయ లక్ష్యంతో బరిలో దిగిన ఢిల్లీ 19.5 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసి గెలిచింది.
పృథ్వీ షా (38 బంతుల్లో 56; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ సెంచరీతో పాటు... 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' రిషభ్ పంత్ (21 బంతుల్లో 49; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసక బ్యాటింగ్ ఆడాడు. ఢిల్లీ విజయానికి చివరి ఓవర్లో 5 పరుగులు అవసరంకాగా… నాలుగో బంతికి పరుగు తీసే ప్రయత్నంలో మిశ్రా… బౌలర్ ఖలీల్ త్రోకు అడ్డుగా రావడంతో అబ్స్ట్రక్టింగ్ ద ఫీల్డ్ రూపంలో వెనుదిరిగాడు. 2 బంతుల్లో 2 పరుగులు కావాల్సి ఉండటంతో రైజర్స్లో మళ్లీ ఆశలు చిగురించాయి. అయితే ఐదో బంతిని కీమో పాల్ మిడ్ వికెట్ మీదుగా ఫోర్ కొట్టి ఢిల్లీని విజయతీరాలకు చేర్చాడు. దీంతో ఐపీఎల్ 12వ సీజన్లో రెండో క్వాలిఫయర్కు అర్హత సాధించింది ఢిల్లీ జట్టు. రేపు ఇదే స్టేడియం వేదికగా చెన్నై, ఢిల్లీ తలపడనున్నాయి. ఇందులో గెలిచే జట్టు ఫైనల్లో ముంబైని ఢీకొట్టనుంది.