IND Playing 11 vs ZIM: జింబాబ్వేతో 'డూ ఆర్ డై' మ్యాచ్.. భారత బ్యాటింగ్ ఆర్డర్‌లో భారీ మార్పులు!

IND Playing 11 vs ZIM: టీ20 ప్రపంచకప్‌ 2026లో సెమీస్ అవకాశాలను భారత్ సంక్లిష్టం చేసుకున్న విషయం తెలిసిందే. సూపర్-8 మొదటి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై భారీ తేడాతో ఓడిపోవడంతో టీమిండియా నెట్ రన్‌రేట్ భారీగా పడిపోయింది.

Update: 2026-02-24 12:54 GMT

IND Playing 11 vs ZIM: జింబాబ్వేతో 'డూ ఆర్ డై' మ్యాచ్.. భారత బ్యాటింగ్ ఆర్డర్‌లో భారీ మార్పులు!

IND Playing 11 vs ZIM: టీ20 ప్రపంచకప్‌ 2026లో సెమీస్ అవకాశాలను భారత్ సంక్లిష్టం చేసుకున్న విషయం తెలిసిందే. సూపర్-8 మొదటి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై భారీ తేడాతో ఓడిపోవడంతో టీమిండియా నెట్ రన్‌రేట్ భారీగా పడిపోయింది. ఇక జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ భారీ విజయం సాధించడంతో భారత్ సెమీస్ ఆశలు సన్నగిల్లాయి. ఇప్పుడు భారత్ తన తదుపరి రెండు మ్యాచ్‌లలో గెలవడమే కాకుండా.. నెట్ రన్‌రేట్ కూడా భారీగా మెరుగుపర్చుకోవాలి. ఈ నేపథ్యంలోజింబాబ్వేతో జరిగే సూపర్-8 మ్యాచ్‌కు ముందు టీమిండియా కాంబినేషన్‌పై ఆసక్తికర చర్చలు సాగుతున్నాయి.

టీ20 ప్రపంచకప్‌ 2026లో స్పిన్ బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో భారత్ ఇబ్బందులు పడుతోంది. ఈ నేపథ్యంలో ఓపెనింగ్ జోడీ నుంచి మిడిల్ ఆర్డర్ వరకు మార్పులు ఉండొచ్చని తెలుస్తోంది. స్పిన్‌కు అనుకూలంగా ఉండే చెపాక్ స్టేడియం పిచ్ పరిస్థితులు టీమ్ మేనేజ్‌మెంట్‌ను కొత్త వ్యూహాలపై దృష్టి పెట్టేలా చేస్తున్నాయి. అభిషేక్ శర్మతో పాటు సంజూ శాంసన్‌ను ఓపెనింగ్‌కు పంపే ఆలోచనలో మేనేజ్‌మెంట్‌ ఉందని సమాచారం. ఇదే నిజమైతే స్పిన్‌ను బాగా ఆడగల బ్యాటర్ ముందే స్ట్రైక్‌లోకి వస్తాడు. ఓపెనింగ్‌లో లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లపై ప్రత్యర్థి జట్లు స్పిన్‌తో దాడి చేస్తుండడమే ఇందుకు అసలు కారణం. గత మ్యాచ్‌ల్లో తొలి ఓవర్‌లోనే స్పిన్ బౌలింగ్‌లో టీమిండియా వికెట్ కోల్పోయింది. సంజూ స్పిన్‌ను బాగా అడగలడు కాబట్టి ఓపెనింగ్‌లో ఆడించాలని కెప్టెన్, కోచ్ నిర్ణయించినట్లు సమాచారం.

నంబర్-3లో ఇషాన్ కిషన్‌ను దింపే అవకాశముంది. అతని అగ్రెసివ్ బ్యాటింగ్ పవర్‌ప్లే తర్వాత కూడా రన్‌రేట్ పెంచడంలో సహాయపడుతుంది. తిలక్ వర్మ స్థానం గల్లంతు కానుంది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేయనున్నాడు. ఇంకో వ్యూహంగా కెప్టెన్ సూర్యను నంబర్-3లో పంపి స్పిన్‌ బౌలర్లపై దాడి చేయించాలని కూడా మేనేజ్‌మెంట్‌ భావిస్తోందట. ఆపై హార్దిక్ పాండ్య, శివమ్ దూబే, రింకు సింగ్ ఆడుతారు. వాషింగ్టన్ సుందర్ స్థానంలో అక్షర్ పటేల్ ఆడే అవకాశాలు కూడా ఉన్నాయి. స్పిన్ పిచ్ కాబట్టి భారత్ ఒకే స్పెషలిస్ట్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాతో బరిలోకి దిగనుంది. అర్షదీప్ స్థానంలో మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ ఆడే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. హార్దిక్, దూబేలు బుమ్రాకు అండగా నిలుస్తారు.

చెపాక్ పిచ్ సంప్రదాయంగా స్పిన్నర్లకు సహకరిస్తుంది. అందుకే ఈ మ్యాచ్‌లో సరైన బ్యాటింగ్, బౌలింగ్ ఎంపికే విజయం నిర్ణయించే కీలక అంశంగా మారనుంది. ప్రత్యర్థి స్పిన్ దాడిని సమర్థంగా ఎదుర్కొంటే.. భారత్‌కు మ్యాచ్‌పై పూర్తి ఆధిపత్యం సాధించే అవకాశం ఉంటుంది. మన స్పిన్నర్లు కూడా తిప్పేస్తేనే జింబాబ్వేపై భారీ విజయం సాధ్యమవుతుంది. టీమ్ మేనేజ్‌మెంట్ ఏ కాంబినేషన్‌ను ఎంచుకుంటుందో తెలుసుకోవాలంటే టాస్ వరకు వేచి చూడాల్సిందే.

Tags:    

Similar News