Suryakumar Yadav: అదే మా కొంపముంచింది.. దక్షిణాఫ్రికా ఓటమిపై సూర్య ఆసక్తికర వ్యాఖ్యలు!
దక్షిణాఫ్రికా మ్యాచ్లో చేసిన తప్పిదాలే మాకు భారీ నష్టమయ్యాయి.. సెమీస్ అవకాశాలపై సూర్యకుమార్ యాదవ్ కీలక వ్యాఖ్యలు.
Suryakumar Yadav: అదే మా కొంపముంచింది.. దక్షిణాఫ్రికా ఓటమిపై సూర్య ఆసక్తికర వ్యాఖ్యలు!
టీ20 ప్రపంచకప్ 2026 సూపర్-8లో భాగంగా ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ ఓటమిపై భారత్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు. బ్యాటింగ్ వైఫల్యమే తమ కొంపముంచిందని స్పష్టం చేశాడు. ఛేదనలో అవసరమైన భాగస్వామ్యాలను నెలకొల్పలేకపోయామని పేర్కొన్నాడు. తమ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారని ప్రశంసించాడు. గెలుపోటములు ఆటలో భాగమే అని, తాము వచ్చే మ్యాచులో పుంజుకుంటాం అని సూర్యకుమార్ ధీమా వ్యక్తం చేశాడు. సూపర్-8 గ్రూప్-1లో జరిగిన తొలి మ్యాచ్లో భారత్ 76 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా చేతిలో చిత్తయింది. ముందుగా బ్యాటింగ్ చేసిన సఫారీలు 7 వికెట్ల నష్టానికి 187 రన్స్ చేసింది. ఛేదనలో భారత్ 18.5 ఓవర్లలో 111 పరుగులకే ఆలౌట్ అయింది.
మ్యాచ్ అనంతరం భారత్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. 'మ్యాచ్ ప్రారంభంలోనే దక్షిణాఫ్రికాను 21/3కి పరిమితం చేయడంతో మేము మంచి ఆరంభం చేశాం. అయితే 7 నుంచి 15 ఓవర్ల మధ్య ప్రత్యర్థి బ్యాటర్లు బాగా ఆడారు. అయినప్పటికీ చివర్లో మళ్లీ మేము మ్యాచ్లోకి తిరిగి వచ్చాము. బౌలింగ్ పరంగా మంచి ప్రదర్శన చేశాం. బ్యాటింగ్లో మెరుగ్గా ఆడాల్సింది. ఛేజింగ్ చేసే సమయంలో పవర్ప్లే కీలకం. 180–185 పరుగుల లక్ష్యాన్ని చేదించేటపుడు పవర్ప్లేలో మ్యాచ్ గెలవలేమని, కానీ ఓడిపోవచ్చని గ్రహించాలి. ప్రారంభంలో ఎక్కువ వికెట్లు కోల్పోవడం వల్ల చిన్న చిన్న భాగస్వామ్యాలు నిర్మించలేకపోయాము. ఈ ఓటమి మమ్మల్ని నిరాశ పరిచింది. గెలుపోటములు ఆటలో భాగమే. ఈ తప్పుల నుంచి నేర్చుకుని మరింత బలంగా తిరిగి వస్తాం' అని ధీమా వ్యక్తం చేశాడు.
'మా బౌలర్లు అద్భుతంగా బంతులు వేశారు. బౌలింగ్ జోడీ జస్ప్రీత్ బుమ్రా–అర్ష్దీప్ సింగ్ అద్భుతం. ఈ ఇద్దరూ కలిసి ఎనిమిది ఓవర్లు వేసి ఐదు వికెట్లు తీసి కేవలం 45–50 పరుగులే ఇచ్చారు. వీరిద్దరూ అనుభవజ్ఞులు కావడం జట్టుకు పెద్ద బలం. తదుపరి మ్యాచ్లో జింబాబ్వేపై మేము సింపుల్గా ఆడుతాం. మా బ్రాండ్ క్రికెట్నే కొనసాగిస్తాం. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని విభాగాల్లో మెరుగ్గా ఆడి బలంగా తిరిగి వస్తాం' అని సూర్యకుమార్ యాదవ్ స్పష్టం చేశాడు. ఈ ఓటమితో భారత్ సెమీస్ అవకాశాలు సన్నగిల్లాయి. మిగతా రెండు మ్యాచులలో గెలిస్తేనే టీంఇండియా సెమీస్ చేరుతుంది.