ఇటు బౌలర్లు.. అటు బ్యాట్స్ మెన్ ఇద్దరూ చెలరేగడంతో వెస్టిండీస్ తో రెండో టీ20 మ్యాచ్ లో విజయం సాధించింది టీమిండియా. దీంతో మూడు మ్యాచ్ ల ఈ సిరీస్ ను రెండు వరుస మ్యాచ్ లు గెలిచి తన ఖాతాలో వేసుకుంది టీమిండియా. కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో వెస్టిండీస్ భారత్ కు ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. పెద్దగా కష్టపడకుండానే రెండో టి20 మ్యాచ్లో కోహ్లి సేన డక్వర్త్ లూయిస్ పద్ధతిలో 22 పరుగుల తేడాతో వెస్టిండీస్పై నెగ్గింది.
టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. ఓపెనర్ రోహిత్ శర్మ (51 బంతుల్లో 67; 6 ఫోర్లు, 3 సిక్స్లు) టాప్ స్కోరర్. కెప్టెన్ కోహ్లి (23 బంతుల్లో 28; ఫోర్, సిక్స్), 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' కృనాల్ పాండ్యా (13 బంతుల్లో 20 నాటౌట్; 2 సిక్స్లు) ఫర్వాలేదనిపించారు. విండీస్ బౌలర్లలో థామస్ (2/27), కాట్రెల్ (2/25) రెండేసి వికెట్లు తీశారు. ఛేదనలో రావ్మన్ పావెల్ (34 బంతుల్లో 54; 6 ఫోర్లు, 3 సిక్స్లు) మెరుపులు మినహా విండీస్ తరఫున పెద్దగా ప్రతిఘటన లేకపోయింది. ఆఫ్ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ (1/12), పేసర్ భువనేశ్వర్ (1/7) ప్రత్యర్థిని మొదట్లోనే దెబ్బకొట్టారు. విజయానికి 27 బంతుల్లో 70 పరుగులు అవసరమైన దశలో విండీస్ 98/4తో ఉన్న స్థితిలో వర్షం కారణంగా మ్యాచ్ను నిలిపివేశారు. డక్వర్త్ లూయిస్ పద్ధతి వర్తింపజేయగా... విండీస్ ఇంకా 22 పరుగులు వెనుకబడి ఉన్నట్లు తేలింది. సిరీస్ లో మూడో టి20 మంగళవారం జరుగుతుంది.