స్వల్ప లక్ష్యానికీ చెమటలు పట్టాయి.. ఆడుతూ పాడుతూ గెలుస్తారనుకున్న చోట ఎట్టకేలకు గెలిచారు అనిపించుకున్నారు. వెస్టిండీస్ టూర్ లో భాగంగా శనివారం టీమిండియా విండీస్ తో తొలి టీ20 మ్యాచ్ ఆడింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్ తన తొలి మ్యాచ్ లోనే నవదీప్ సైనీ అద్భుత ప్రదర్శనతో సంచలనం సృష్టించడంతో పాటు, బౌలర్లు అందరూ సమిష్టిగా రాణించడంతో విండీస్ ను 95 పరుగులకే కట్టడి చేయగలిగింది.
96 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన భారత్ జట్టు ఆదిలోనే ధావన్ వికెట్ చేజార్చుకుంది. రోహిత్ తనదైన శైలిలో ఆడుతూ భారత్ ఛేదనను నడిపించాడు. కోహ్లి అతడికి సహకరించాడు. అయితే, నరైన్ (2/14) వరుస బంతుల్లో రోహిత్, రిషభ్ పంత్ (0)ను ఔట్ చేసి కలవరపెట్టాడు. నరైన్ యార్కర్ లెంగ్త్ బంతిని భారీ షాట్ కొట్టబోయి రోహిత్ లాంగాన్లో పొలార్డ్కు చిక్కాడు. పంత్ బంతి గమనాన్ని ఊహించకుండా బల ప్రయోగం చేసి వికెట్ పారేసుకున్నాడు. దాదాపు విండీస్ తరహాలోనే 32/3తో నిలిచిన భారత్ను కోహ్లి, పాండే ఆదుకున్నారు. నాలుగో వికెట్కు 30 బంతుల్లో 32 పరుగులు జోడించి విజయానికి బాట వేశారు. వీరిద్దరూ ఒకరివెంట ఒకరు వెనుదిరిగినా... కృనాల్ (12), జడేజా (10 నాటౌట్) లక్ష్యానికి దగ్గరగా తీసుకొచ్చారు. కీమో పాల్ ఓవర్లో సిక్స్ కొట్టిన సుందర్ (8 నాటౌట్) భారత్ విజయలక్ష్యాన్ని పూర్తి చేశాడు. నవదీప్ సైనీ కి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.