IND vs SA 1st Test: భారత్-సౌతాఫ్రికా టెస్ట్ పోరు షురూ.. అందరి చూపు రిషబ్ పంత్ మీదే
భారత క్రికెట్ అభిమానులకు పండగే. టీమిండియా నేటి నుంచి సౌత్ ఆఫ్రికా జట్టుతో రెండు మ్యాచ్ల ప్రతిష్టాత్మక టెస్ట్ సిరీస్ను ప్రారంభించనుంది.
IND vs SA 1st Test: భారత్-సౌతాఫ్రికా టెస్ట్ పోరు షురూ.. అందరి చూపు రిషబ్ పంత్ మీదే
IND vs SA 1st Test: భారత క్రికెట్ అభిమానులకు పండగే. టీమిండియా నేటి నుంచి సౌత్ ఆఫ్రికా జట్టుతో రెండు మ్యాచ్ల ప్రతిష్టాత్మక టెస్ట్ సిరీస్ను ప్రారంభించనుంది. కోల్కతాలోని చారిత్రక ఈడెన్ గార్డెన్స్ మైదానం తొలి టెస్టుకు ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ సిరీస్... ప్రపంచ టెస్ట్ చాంపియన్షిప్ నాల్గవ ఎడిషన్లో ఇరు జట్లకు కీలకం కానుంది. స్వదేశంలో ఈ ఏడాది భారత్కు ఇదే చివరి టెస్ట్ సిరీస్ కావడం విశేషం. యువ కెప్టెన్ శుభ్మన్ గిల్ సారథ్యంలో భారత్ సత్తా చాటాలని చూస్తుంటే, పాకిస్థాన్ టూర్ను ముగించుకొని వచ్చిన సౌతాఫ్రికా కూడా గట్టి పోటీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది.
దాదాపు నాలుగు నెలల పాటు గాయంతో క్రికెట్కు దూరమైన విధ్వంసకర వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ రిషభ్ పంత్ తిరిగి జట్టులోకి రావడంతో భారత మిడిల్ ఆర్డర్ మరింత బలంగా మారింది. పంత్ రాకతో జట్టుకు ఫైర్ పవర్ తో పాటు దూకుడు పెరుగుతుంది. అతనికి తోడు శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ ఫామ్ కూడా మిడిల్ ఆర్డర్కు స్థిరత్వాన్ని ఇవ్వనుంది. ఫాస్ట్ బౌలింగ్లో జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ తమ పేస్తో సవాలు విసరనున్నారు.
కోల్కతా పిచ్పై ప్రస్తుతం పెద్ద చర్చ నడుస్తోంది. కెప్టెన్ శుభ్మన్ గిల్ చెప్పినట్లుగా ఈ పిచ్ సాంప్రదాయ భారతీయ పిచ్ ను పోలి ఉంటుంది. అంటే, ఇక్కడ స్పిన్నర్లదే రాజ్యం అని అర్థం. పిచ్ క్యురేటర్ సుజన్ ముఖర్జీ కూడా... మూడో రోజు నుంచి పిచ్ బాగా తిరుగుతుందని స్పష్టం చేశారు. అయితే, మొదటి రెండు రోజులు మంచి బౌన్స్ ఉంటుందని, ఇది స్ట్రోక్ ప్లేయర్లకు (బౌండరీల కోసం ఆడేవారికి) ఉపయోగపడుతుందని చెప్పారు. మ్యాచ్ మూడో రోజు నుంచి బంతి విపరీతంగా తిరిగే అవకాశం ఉండడంతో, సఫారీ బ్యాట్స్మెన్లకు స్పిన్నర్లు రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ రూపంలో అసలైన సవాలు ఎదురుకానుంది.
భారత స్పిన్నర్లకు సవాలు విసరడానికి సౌతాఫ్రికా జట్టులో కూడా భారత సంతతికి చెందిన కేశవ్ మహరాజ్ తో పాటు మరో ఇద్దరు స్పిన్నర్లు ఉన్నారు. వీరు ఇటీవల పాకిస్థాన్ పిచ్లపై ఆడిన అనుభవం ఉండడంతో, భారత బ్యాట్స్మెన్లకు కూడా వీరు గట్టి పోటీ ఇవ్వగలరు. అయితే, ఈ మ్యాచ్కు వర్షం ముప్పు లేకపోవడం క్రికెట్ అభిమానులకు ఊరట కలిగించే విషయం.
కోల్కతాలో టీమ్ ఇండియాకు అద్భుతమైన టెస్ట్ రికార్డు ఉంది. 1934లో ఇక్కడ తొలి టెస్ట్ ఆడిన భారత్, ఇప్పటివరకు మొత్తం 42 మ్యాచ్లు ఆడింది. ఇందులో 13 విజయాలు, 9 ఓటములు నమోదు కాగా, 20 మ్యాచ్లు డ్రా అయ్యాయి.
మ్యాచ్ ఎప్పుడు? ఎక్కడ చూడాలి?
ట్రాస్ సమయం: ఉదయం 9:00 గంటలకు
మ్యాచ్ ఆరంభం: ఉదయం 9:30 గంటలకు
లైవ్ టెలికాస్ట్: స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్
లైవ్ స్ట్రీమింగ్: జియోహాట్స్టార్