Australia Cricket: పతన దశలో ఆస్ట్రేలియా.. వచ్చే 20 ఏళ్లు ఐసీసీ ట్రోఫీ కష్టమే?
మాజీ క్రికెటర్ల ఆందోళన వ్యక్తం తరతరాల మార్పులో ట్రాన్సిషన్ ఫేజ్లో ఆసీస్ జట్టు
Australia Cricket: పతన దశలో ఆస్ట్రేలియా.. వచ్చే 20 ఏళ్లు ఐసీసీ ట్రోఫీ కష్టమే?
ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో ఆస్ట్రేలియా జట్టు భవిష్యత్తుపై సోషల్ మీడియాలో చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఒకప్పుడు ఐసీసీ టోర్నమెంట్లలో ఆధిపత్యం చెలాయించిన ఆసీస్ టీమ్.. ఇప్పుడు ఆ స్థాయి ప్రభావం చూపలేకపోతుందనే అభిప్రాయాలు జోరుగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా అభిమానులు, విశ్లేషకులు వచ్చే సంవత్సరాల్లో ఆస్ట్రేలియా జట్టు ప్రదర్శనపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఆసీస్ ప్రదర్శన, భవిష్యత్తు ప్రణాళికలు చుస్తే.. వచ్చే 20 ఏళ్లు ఐసీసీ ట్రోఫీ కష్టమే అని అంటున్నారు. టీ20 ప్రపంచకప్ 2026లో జింబాబ్వేపై ఓడిపోవడమే ఈ విమర్శలు వస్తున్నాయి.
ఆస్ట్రేలియా పతన దశలో ఉందనడానికి ప్రధాన కారణం జట్టు సీనియర్ బౌలర్ల వయస్సు. పేసర్లు మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్, జోష్ హేజిల్వుడ్ కెరీర్ చివరి దశలోకి వెళ్తున్నారు. వారికి సరైన బ్యాకప్ బౌలర్లు ప్రస్తుతం సిద్ధంగా లేరని విమర్శలు వస్తున్నాయి. గతంలో ఆసీస్ బలం వారి బెంచ్ స్ట్రెంగ్త్ కాగా.. ఇప్పుడు అదే అంశం బలహీనతగా మారింది. ఒక్కప్పుడు తుది జట్టులో ఆడడానికి ప్లేయర్స్ పోటీ పడేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.
బ్యాటింగ్ విభాగంలో కూడా పరిస్థితి అంత ఆశాజనకంగా లేదనే చెప్పాలి. ప్రస్తుతం జట్టులో నిలకడగా రాణిస్తున్న బ్యాటర్లలో ట్రావిస్ హెడ్ ఒక్కడే ఉన్నాడు. మిగతా బ్యాటింగ్ లైనప్లో స్థిరత్వం లోపించడం జట్టు విజయాలకు అడ్డంకిగా మారుతుంది. బెంచ్ ప్లేయర్స్ కూడా లేరు. ఒక్కో మ్యాచ్లో ఆసీస్ బ్యాటింగ్ మరీ తీసికట్టుకుగా ఉంటోంది. ఇటీవలి ఐసీసీ టోర్నమెంట్లలో కూడా ఆసీస్ ప్రదర్శన చెప్పుకోదగ్గ రీతిలో లేదు. 2023 అనంతరం ఆసీస్ ఆట పూర్తిగా గాడి తప్పింది. ప్రస్తుత జట్టుపై నమ్మకం లేకపోవడం అభిమానుల్లో ఆందోళన కలిగిస్తోంది. సరైన ప్రణాళికతో యువ ఆటగాళ్లను సిద్ధం చేయకపోతే.. భవిష్యత్తులో ఐసీసీ ట్రోఫీలు గెలవడం కష్టమవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మొత్తంగా చూస్తే.. ఆస్ట్రేలియా క్రికెట్ మరో ట్రాన్సిషన్ దశలో ఉందని చెప్పొచ్చు. కొత్త ప్రతిభను తీర్చిదిద్దడం, జట్టులో సమతుల్యత తీసుకురావడం వంటి అంశాలపై దృష్టి పెట్టితేనే మళ్లీ పాత వైభవాన్ని అందుకునే అవకాశం ఉంటుంది. లేదంటే ప్రపంచ క్రికెట్లో ఆసీస్ ఆధిపత్యం తగ్గిపోవచ్చని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.