Asia Cup 2025: భారత్పై ఫిర్యాదు చేసిన పాకిస్థాన్.. మ్యాచ్ గెలిచిన టీమిండియా ఆ పని ఎందుకు చేయలేదు?
Asia Cup 2025: ఆసియా కప్ 2025 టోర్నమెంట్లో భాగంగా దాయాది పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించినప్పటికీ, మ్యాచ్ అనంతరం చోటుచేసుకున్న ఓ ఘటన తీవ్ర చర్చకు దారితీసింది.
Asia Cup 2025: ఆసియా కప్ 2025 టోర్నమెంట్లో భాగంగా దాయాది పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించినప్పటికీ, మ్యాచ్ అనంతరం చోటుచేసుకున్న ఓ ఘటన తీవ్ర చర్చకు దారితీసింది. మ్యాచ్ ముగిశాక పాకిస్థాన్ ఆటగాళ్లతో కరచాలనం (షేక్హ్యాండ్) చేసేందుకు భారత ఆటగాళ్లు నిరాకరించడం వివాదాస్పదమైంది. దీనిపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మ్యాచ్ రిఫరీకి అధికారికంగా ఫిర్యాదు చేసింది.
దుబాయ్లో జరిగిన ఈ మ్యాచ్లో భారత్ ఏడు వికెట్ల తేడాతో పాక్పై గెలుపొందింది. అయితే, మ్యాచ్ తర్వాత సంప్రదాయం ప్రకారం షేక్హ్యాండ్ కోసం పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా, కోచ్ మైక్ హెస్సన్తో పాటు ఆ జట్టు ఆటగాళ్లంతా మైదానంలో ఎదురుచూశారు. కానీ, భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన సహచరుడు శివమ్ దూబేతో కలిసి నేరుగా డ్రెస్సింగ్ రూమ్కు వెళ్ళిపోయారు. డ్రెస్సింగ్ రూమ్ తలుపులు మూసి ఉండటంతో పాక్ జట్టు నిరాశగా వెనుదిరిగింది.
ఈ ఘటనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన పీసీబీ, ఇది క్రీడాస్ఫూర్తికి విరుద్ధమని పేర్కొంటూ మ్యాచ్ రిఫరీ అండీ పైక్రాఫ్ట్కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది. అయితే, ఈ నిర్ణయం పాకిస్థాన్ను ఉద్దేశించి తీసుకున్నది కాదని, ఏప్రిల్లో పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన 26 మంది బాధితుల కుటుంబాలకు సంఘీభావంగానే ఇలా చేశామని భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. ఈ విజయాన్ని బాధితుల కుటుంబాలకు, భారత సాయుధ బలగాలకు అంకితమిస్తున్నట్లు ఆయన తెలిపారు. కాశ్మీర్ దాడి అనంతరం ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో ఈ ఘటన మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.