ముంబైః నగరంలోని ఘట్కొపర్ ప్రాంతంలో దారుణం జరిగింది. భార్యకు వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో ఓ ఫ్రొఫెసర్ తన భార్యను దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత తానూ గొంతు కోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. అయితే ఆసుపత్రికి సకాలంలో తరలించడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. పోలీసులు ఆ ఫ్రొఫెసర్పై హత్య కేసు నమోదు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ముంబైలోని ఘట్కొపర్ ప్రాంతంలో ఝంజ్హున్వాలా కళాశాలలో పనిచేస్తున్న ప్రొఫెసర్ సంజయ్ త్రయంబక్(46) తన భార్య విద్య(42) నివాసముంటున్నారు. వీరికి అక్షయ్(22), సాగర్(19) అనే ఇద్దరు కొడుకులున్నారు. ఈ కుటుంబానికి ఆయుర్వేదిక్ మెడిసిన్ స్టోర్ ఉంది. ఈ స్టోర్ను సంజయ్ భార్య నిర్వహించేది. దీంతో భార్య ఎవరితోనో సంబంధం పెట్టుకుందనే అనుమానం సంజయ్ను కలచివేసింది.
ఈ అనుమానం వల్ల భార్యతో పలుమార్లు గొడవ పెట్టుకున్నాడు. నిన్న రాత్రి కూడా ఇలాగే ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అయితే ఈ వాగ్వాదం ఘర్షణకు దారి తీసింది. సంజయ్ క్షణికావేశంలో భార్యను కత్తితో పొడిచి హత్య చేశాడు. ఇంట్లోనే వేరే గదిలో ఉన్న కొడుకును విద్య కేకలు వేసి పిలిచింది. అక్షయ్ వచ్చే లోపే ఆమె రక్తపు మడుగులో పడి కొట్టుమిట్టాడుతూ.. కొద్ది నిమిషాలకే ప్రాణాలు కోల్పోయింది. అప్పటికే సంజయ్ కూడా గొంతు కోసుకోవడం వల్ల తీవ్ర రక్తస్రావంతో ఫ్లోర్పై పడిపోయాడు. ఆసుపత్రికి తరలించి చికిత్స చేయడంతో ప్రాణాపాయం తప్పింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.