World’s Largest Shivling: బీహార్లో నిలిచిన ప్రపంచంలోనే అతిపెద్ద శివలింగం తరలింపు
బీహార్ గోపాల్గంజ్లో గండక్ నదిపై వంతెన బలహీనత కారణంగా 210 టన్నుల ప్రపంచంలోనే అతిపెద్ద శివలింగం తరలింపు నిలిచిపోయింది.
World’s Largest Shivling: బీహార్లో నిలిచిన ప్రపంచంలోనే అతిపెద్ద శివలింగం తరలింపు
బీహార్లోని గోపాల్గంజ్ జిల్లాలో ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత బరువైన శివలింగం తరలింపు ప్రక్రియ అర్ధాంతరంగా నిలిచిపోయింది. గండక్ నదిపై (స్థానికంగా నారాయణి నది) ఉన్న వంతెన బలహీన స్థితిలో ఉండటమే ఇందుకు ప్రధాన కారణంగా అధికారులు వెల్లడించారు.
తమిళనాడులోని మహాబలిపురంలో తయారైన ఈ భారీ శివలింగం ఆదివారం ఉదయం గోపాల్గంజ్కు చేరుకుంది. సుమారు 210 టన్నుల బరువు ఉన్న శివలింగాన్ని, 160 టన్నుల బరువున్న 106 చక్రాల ప్రత్యేక ట్రైలర్పై తరలిస్తున్నారు. మొత్తం బరువు దాదాపు 370 టన్నులు కావడంతో, వంతెనపై తీవ్ర ఒత్తిడి పడే ప్రమాదం ఉందని ప్రాథమిక తనిఖీల్లో తేలింది.
వంతెనపై పలు చోట్ల పగుళ్లు ఉన్నట్లు గుర్తించిన అధికారులు భద్రతా కారణాలతో శివలింగం తరలింపును తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ పరిస్థితిని సమీక్షించేందుకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI), బీహార్ రాజ్య పుల్ నిర్మాణ్ నిగమ్ లిమిటెడ్ (BRPNNL) బృందాలను పిలిపించినట్లు జిల్లా కలెక్టర్ పవన్ కుమార్ సిన్హా తెలిపారు. బీహార్ మంత్రి అశోక్ చౌదరి కూడా గోపాల్గంజ్కు వచ్చి వంతెనను పరిశీలించనున్నట్లు సమాచారం.
ఈ శివలింగాన్ని తూర్పు చంపారన్ జిల్లా కేంద్రం మోతిహారిలోని విరాట్ రామాయణ్ ఆలయానికి తరలించాల్సి ఉంది. మహాబలిపురం నుంచి దాదాపు 3,178 కిలోమీటర్ల దూరాన్ని 32 రోజుల్లో ఈ భారీ వాహనం ప్రయాణించింది.
అయితే, తూర్పు చంపారన్ చేరేందుకు ఉన్న రెండు ప్రత్యామ్నాయ మార్గాల పరిస్థితి కూడా అనుకూలంగా లేదని అధికారులు చెబుతున్నారు. ఒక మార్గంలో వంతెన సామర్థ్యం సరిపోకపోవడం, మరో మార్గంలో చిన్న వంతెనలు, కల్వర్టులు అధికంగా ఉండటం వల్ల ఈ భారీ వాహనం ప్రయాణం ప్రమాదకరంగా మారే అవకాశముందని అంచనా వేశారు. దీంతో శివలింగాన్ని సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చేందుకు అన్ని మార్గాలను అధికారులు పరిశీలిస్తున్నారు.