ఈసారి బడ్జెట్ లో సామాన్యుడికి ఊరట దక్కుతుందా?

Update: 2020-02-01 02:01 GMT

నేడు 2020 - 21 ఆర్ధిక సంవత్సరానికి గాను భారత ప్రభుత్వం బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. ఈ బడ్జెట్ సామాన్యుడికి ఊరట దక్కుతుందా? వేతన జీవిని కరుణిస్తారా? రైతులకు ఏం వరాలు ఉంటాయి అనే దానిమీదే ఉంది. ఆర్థిక వ్యవస్థ మందకొడిగా వృద్ధి చెందుతున్న తరుణంలో.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. 2019 లో తిరిగి అధికారంలోకి వచ్చిన తరువాత రెండవ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఆర్థిక వ్యవస్థ మందగమనం.. దేశం ఎదుర్కొంటున్న సవాళ్లను అలాగే 2025 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక లక్ష్యాన్ని సాధించడానికి కేంద్రం ప్రణాళికలను రూపొందిస్తుందని నిర్మలా సీతారామన్ వెల్లడించారు.

ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే ఉద్దేశంతో గత సెప్టెంబర్‌లో నిర్మలాసీతారామన్ కార్పోరేట్‌ పన్నును బాగా తగ్గించారు. అంతేకాకుండా వస్తు, సేవలపై జీఎస్టీని తగ్గించింది. అందులో భాగంగా స్థిరాస్థి, ఎలక్ట్రిక్‌ వాహనాలు, హాస్టల్‌ వసతి, వజ్రాల తయారీ, ఔట్‌ డోర్‌ కేటరింగ్‌లాంటి వాటిపై జీఎస్టీ పన్ను తగగ్గించడంతో.. దాంతో ఖజానాపై 1.45 లక్షల కోట్ల మేర ప్రభావం చూపింది. ఇది ఆర్ధిక కొంత మందగమనానికి కారణమైంది.

ఈ క్రమంలో ఈ సారి రాయితీలు, మినహాయింపులు, సబ్సిడీలివ్వడం సాధ్యం కాకపోవచ్చని ఆర్థిక రంగ నిపుణులు అంచనా వేస్తోన్నారు. ఇకపోతే కార్పొరేట్ పన్నులు తగ్గించినట్టు తమకు కూడా పన్ను తగ్గిస్తే బాగుంటుందని వేతన జీవులు కోరుతున్నారు. గత బడ్జెట్‌లో ఏడాదికి 5 లక్షలలోపు ఆదాయం ఉన్న వారికి పన్ను మినహాయించారు. ఈ బడ్జెట్‌లోనూ ఎంతో కొంత ప్రయోజనకం చేకూర్చేలా కేంద్రం ప్రకటన చేస్తుందని వారు అసలు పెట్టుకున్నారు. మరోవైపు పెట్టుబడిపై లాభాల పన్ను , డివిడెండ్‌ డిస్ట్రిబ్యూషన్‌ ట్యాక్స్‌ను ఎత్తివేయాలని ఇన్వెస్టర్లు ఆశిస్తున్నారు. రాబోయే పెట్టుబడుల దృష్ట్యా దీనిపై సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తోన్నారు.

ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ (ఎఫ్‌పీవో) ప్రోగ్రామ్ లాంచ్ చేస్తామని ఇదివరకే నిర్మలా సీతారామన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎఫ్‌పీవో ద్వారా చిన్న, సన్నకారు రైతుల గ్రూప్‌‌లు రైతుల ఆదాయం పెరగుదలకు తోడ్పాటును అందిస్తారు. నేడు ప్రవేశ పెట్టబోయే బడ్జెట్ లో ఎఫ్‌పీవో కు రూ.7,000 కోట్లు కేటాయించే అవకాశముందని ఆర్ధిక రంగ నిపుణులు పేరొంటున్నారు. దీని వల్ల 10 వేల వరకు ఎఫ్‌పీవోలను ఏర్పాటు చేసే అవకాశం ఉందని అంటున్నారు. అలాగే భూగర్భ జలాలను ఎక్కువగా వినియోగిస్తున్న ప్రాంతాల్లో నేలను సారవంతంగా మార్చడం, వ్యవసాయ-పర్యావరణ సమతుల్యత పెంచడం కోసం కార్ప్ డైవర్సిఫికేషన్ ను కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దీని కోసం బడ్జెట్ లో రూ.500 నుంచి రూ.600 కోట్లు కేటాయించే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు.

ఇదిలావుంటే శుక్రవారం పార్లమెంటులో ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టారు. ఈ సర్వే ప్రకారం ఏప్రిల్ 1తో మొదలయ్యే ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు 6 నుంచి 6.5శాతం మధ్య ఉండవచ్చని కేంద్రం అంచనా వేసింది. దాంతో వచ్చే ఆర్థిక సంవత్సరంలో జీఎస్‌టీ పన్ను ఆదాయం పెరిగే అవకాశం ఉందని ఆర్థిక సర్వే చెప్పింది. వచ్చే ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ నుండి ప్రారంభమయ్యే సవాళ్లను ఎదుర్కొవడానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు లక్ష్యాన్ని ప్రభుత్వం సడలించాల్సి ఉంటుందని ఆర్థిక సర్వే అంచనా వేసింది. ప్రపంచ పరిస్థితులు భారత్‌కు అనుకూలంగా ఉంటాయనే ఆశాభావం వ్యక్తం చేశారు.  

Tags:    

Similar News