Electoral Bonds: ఎన్నికల బాండ్ల నంబర్లూ చెప్పాల్సిందే.. ఎస్బీఐకి సుప్రీం ఆదేశం
Electoral Bonds: మార్చి 21లోగా ప్రమాణపత్రం సమర్పించాలని ఆదేశించిన సుప్రీంకోర్టు
Electoral Bonds: ఎన్నికల బాండ్ల వ్యవహారంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాపై సుప్రీంకోర్టు మరోసారి సీరియస్ అయ్యింది. తాము ఆదేశించినప్పటికీ బాండ్ల నంబర్లను కేంద్ర ఎన్నికల సంఘానికి ఇవ్వకపోవడంపై బ్యాంకును ప్రశ్నించింది సుప్రీంకోర్టు. నంబర్లతో సహా అన్ని వివరాలను ఈసీకి ఇచ్చి మార్చి 21లోగా తమకు ప్రమాణ పత్రాన్ని సమర్పించాలని ఎస్బీఐని ఆదేశించింది. బాండ్ల విషయంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెలెక్టివ్గా ఉండకూడదని సూచించింది. దీనికి సంబంధించిన ప్రతి సమాచారం బయటకు రావాలని ఆదేశించింది. ఏ దాత.. ఏ పార్టీకి ఎంత ఇచ్చారనే విషయాన్ని తెలియజేసే యునిక్ నంబర్లతో పాటు అన్ని వివరాలను ఎస్బీఐ, ఈసీకి ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది. ఇందులో ఎలాంటి సందేహాలకు తావులేదంటూ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది.
ఎన్నికల బాండ్లను రద్దు చేస్తూ ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. అయితే గత ఐదేళ్లలో జారీ చేసిన బాండ్ల వివరాలను ఈసీకి అందించాలని ఎస్బీఐని ఆదేశించింది. ఆ సమాచారాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించిన బ్యాంకు.. బాండ్ల ఆల్ఫా న్యూమరిక్ నంబర్లను మాత్రం బయటపెట్టలేదు. ఏ వ్యక్తి లేదా సంస్థ బాండ్లను ఏ పార్టీకి విరాళంగా ఇచ్చారని తెలిపే ఈ నంబర్లు లేకపోవడంపై సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం బ్యాంకు తీరుపై అసహనం వ్యక్తం చేసింది.