భారత్లో టెస్లా విద్యుత్ కార్ల ప్లాంట్
* బెంగళూరులో కంపెనీ రిజిస్ట్రేషన్ * ప్లాంట్ ఏర్పాటు చేయమని కోరుతున్న పలు రాష్ట్రాలు * 2021లోనే ప్రారంభంకానున్న కార్యకలాపాలు
భారత్లో విద్యుత్ కార్ల తయారీ కేంద్రం రాబోతోంది. అమెరికాకు చెందిన టెస్లా ఇండియాలో ప్లాంట్ ఏర్పాటుకు రంగం సిద్ధం చేసుకుంది. బెంగళూరులో కంపెనీని రిజిస్టర్ చేసుకుంది. భారత ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే ఇక్కడ తయారయ్యే కారు ఉంటుందని కంపెనీ ప్రకటించింది.
పర్యావరణాన్ని పరిరక్షించే కృషిలో భాగంగా భారత ప్రభుత్వం విద్యుత్ కార్లను ప్రోత్సహిస్తోంది. అందులో భాగంగానే ప్రపంచంలోనే పేరుపొందిన అమెరికాకు చెందిన టెస్లా కంపెనీ తన విద్యుత్ కార్ల కంపెనీని భారత్లో ఏర్పాటు చేయబోతోంది. ఇప్పటికే బెంగళూరులో టెస్లా ఇండియా మోటార్స్ పేరుతో రిజిస్టర్ చేయించుకుంది. అయితే ప్లాంట్ ఎక్కడ ఏర్పాటు చేసేది ఇంకా స్పష్టత రాలేదు. మహారాష్ట్రలో పెట్టుబడులు పెట్టాలని అక్కడి ప్రభుత్వం కోరినా కంపెనీ మాత్రం బెంగళూరులోనే రిజిస్టర్ చేసుకుంది. కాని ప్లాంట్ ఏర్పాటు చేయాలని అనేక రాష్ట్రాలు ఇప్పటికే ఆఫర్లు ప్రకటించాయి. 2021లోనే కంపెనీ ఇండియాలో తన కార్యకలాపాలు ప్రారంభిస్తుందని కేంద్రం ఇప్పటికే తెలిపింది. రానున్న ఐదేళ్ళలో భారత్ ప్రపంచంలోనే అతి పెద్ద విద్యుత్ కార్ల తయారీ కేంద్రం కానుందని ఆశిస్తున్నారు. టెస్లా తర్వాత మరికొన్ని కంపెనీలు విద్యుత్ కార్ల రంగంలోకి ప్రవేశించడానికి రెడీ అవుతున్నాయి.
భారత్లో పరిశోధనా కేంద్రం, ప్లాంట్, స్టోర్స్ ఏర్పాటు చేయడానికి టెస్లా ఐదు రాష్ట్రాలతో సంప్రదింపులు జరుపుతోందని కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ ట్వీట్ చేశారు. భారత్లో పేద ప్రజలు ఎక్కువ మంది ఉన్నప్పటికీ కంపెనీ కేవలం 8.5 కోట్ల మందినే లక్ష్యంగా చేసుకుని రంగంలోకి దిగబోతోంది. అయితే భారతీయుల ఆకాంక్షలకు అనుగుణంగానే తమ ఇండియా కారు తయారవుతుందని భరోసా ఇచ్చారు ఎలాన్ మస్క్. ప్రపంచంలో వాతావరణ కాలుష్యం పెరిగిపోతున్న దృష్ట్యా అనేక దేశాలు పర్యావరణ హితమైన కార్ల తయారీని ప్రోత్సహిస్తున్నాయి. ప్రపంచంలోని అతిపెద్ద మార్కెట్లలో ఒకటైన భారత్లో కంపెనీలు నెలకొల్పడానికి అనేక దిగ్గజ సంస్థలు ముందుకు వస్తున్నాయి.
వాతవరణ ఒప్పందంలో భాగంగా 2030 నాటికి కర్బన ఉద్గారాలను 30-35 శాతానికి తగ్గించాలని లక్ష్యంగా భారత్ నిర్దేశించుకుంది. దీనిలో భాగంగా రూ.8 లక్షల కోట్ల ఇంధన ఉత్పత్తుల దిగుమతులను తగ్గించుకోవాలని అనుకుంటోంది. వీటితో పాటు హరిత ఇంధనం, విద్యుత్ వాహనాల పెంపుపైనా భారత్ దృష్టి సారించింది. 2030 నాటికి ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు పెంచేందుకు ప్రైవేటు కార్లకు 30శాతం, వాణిజ్య కార్లకు 70శాతం, బస్సులకు 40శాతం, ద్విచక్ర వాహనాలకు 80శాతం చొప్పున ప్రోత్సాహకాలను అందించాలని కేంద్రం భావిస్తోంది.