అమితాబ్కి సజ్జనార్ ట్వీట్.. జనాన్ని మోసం చేసే కంపెనీలకు ప్రచారం చేయొద్దని..
Sajjanar: జనాన్ని మోసం చేసే కంపెనీలకు ప్రచారం చేయొద్దని విజ్ఞప్తి
Sajjanar: గొలుసుకట్టు సంస్థలకు ప్రచారం చేయొద్దు
Sajjanar: బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ సినిమాలతో పాటు యాడ్స్ ద్వారా కూడా భారీగానే సంపాదిస్తారు. ఆయన ప్రమోట్ చేశారంటే ఆ ప్రోడక్ట్ జనాల్లోకి దూసుకుపోతుంది. అందుకే పలు కంపెనీలు కోట్లలో డబ్బులు ఇచ్చి అమితాబ్ని తమ ప్రోడక్ట్స్ కు బ్రాండ్ అంబాసిడర్గా పెట్టుకుంటున్నాయి. అయితే వాటిలో కొన్ని కంపెనీలు జనాలను మోసం చేస్తున్నాయని, అలాంటి వాటికి ప్రచారం చేయ్యొద్దని అమితాబ్కు విజ్ఞప్తి చేశారు సీనియర్ ఐపీఎస్ అధికారి, టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్.
అమితాబ్తో పాటు మిగిలిన స్టార్ హీరోలందరికీ తన విజ్ఞప్తి. మోసం చేసే కంపెనీలకు ప్రచారం చేయకండి. మీ స్టార్ డమ్ను మంచి కోసం వాడండి. మీ పేరు, ప్రతిష్టలను సమాజానికి చెడు చేసే కంపెనీలపై వెచ్చించొద్దు. ఆమ్వే లాంటి కంపెనీలు దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బ తీస్తున్నాయి. ఇలాంటి కంపెనీలకు ప్రచారం చేయడం వల్ల ప్రజలు, వ్యవస్థ మరింత నష్టపోయే ప్రమాదం ఉందని సజ్జనార్ ట్వీట్ చేశాడు.
కాగా, అబితాబ్ బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న మల్టీ లెవల్ మార్కెటింగ్ ప్రమోటింగ్ కంపెనీ ఆమ్వేపై 2022లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసు నమోదు చేసింది. గొలుసు కట్టు వ్యాపారం పేరుతో మోసానికి పాల్పడుతున్నట్టు గుర్తించిన ఈడీ.. ఆమ్వే ఆస్తులను జప్తి చేసింది. ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతుంది.