Fighter Jet Crash : వాయుసేనలో కలకలం..అస్సాం అడవుల్లో కుప్పకూలిన సుఖోయ్-30 ఎంకేఐ
Fighter Jet Crash : అస్సాంలోని జోర్హాట్ నుంచి టేకాఫ్ అయిన ఐఏఎఫ్ సుఖోయ్-30 ఎంకేఐ యుద్ధ విమానం కార్బీ ఆంగ్లాండ్లో కూలిపోయింది. విమానంలోని ఇద్దరు పైలట్ల ఆచూకీ కోసం వాయుసేన ముమ్మరంగా గాలిస్తోంది.
IAF Sukhoi-30MKI Crash Assam 2026
Fighter Jet Crash : అస్సాం గగనతలంలో భారత వాయుసేనకు చెందిన అత్యంత శక్తివంతమైన సుఖోయ్-30 ఎంకేఐ యుద్ధ విమానం కుప్పకూలింది. గురువారం (మార్చి 5, 2026) సాయంత్రం శిక్షణలో భాగంగా జోర్హాట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి టేకాఫ్ అయిన ఈ విమానం, కొద్దిసేపటికే రాడార్ సంబంధాలు కోల్పోయింది. చివరకు జోర్హాట్కు సుమారు 60 కిలోమీటర్ల దూరంలోని కార్బీ ఆంగ్లాండ్ జిల్లా అటవీ ప్రాంతంలో ఈ విమానం కూలిపోయినట్లు వాయుసేన ధ్రువీకరించింది.
ముమ్మరంగా గాలింపు చర్యలు
గురువారం రాత్రి 7:42 గంటల సమయంలో ఈ యుద్ధ విమానంతో చివరిసారిగా సంబంధాలు నమోదయ్యాయి. ఆ తర్వాత రాడార్ నుంచి మాయం కావడంతో వాయుసేన వెంటనే అప్రమత్తమైంది. విమానంలో ఇద్దరు పైలట్లు ఉన్నట్లు సమాచారం. ప్రమాదం జరిగిన కార్బీ ఆంగ్లాండ్ ప్రాంతం దట్టమైన అటవీ, కొండ ప్రాంతం కావడంతో గాలింపు చర్యలకు ఆటంకం కలుగుతోంది. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ బృందాలు హెలికాప్టర్ల సాయంతో పైలట్ల ఆచూకీ కోసం గాలిస్తున్నాయి. స్థానిక నివాసితులు చొకిహోలా ప్రాంతంలో పెద్ద శబ్దం విన్నామని చెప్పడంతో ఆ దిశగా శోధన కొనసాగిస్తున్నారు.
వైమానిక దళానికి వెన్నెముక సుఖోయ్
భారత వాయుసేనలో సుఖోయ్-30 ఎంకేఐ అత్యంత కీలకమైన యుద్ధ విమానం. రష్యా టెక్నాలజీతో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) భారత్లోనే వీటిని తయారు చేస్తోంది. ఇది రెండు ఇంజిన్లు కలిగిన మల్టీ-రోల్ ఫైటర్ జెట్. శత్రు విమానాలను గగనతలంలోనే అడ్డుకోవడంతో పాటు, భూమిపై ఉన్న లక్ష్యాలను అత్యంత కచ్చితత్వంతో ఛేదించగలదు. ప్రస్తుతం వాయుసేన వద్ద 260కి పైగా ఇటువంటి విమానాలు ఉన్నాయి. ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. దీనిపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించే అవకాశం ఉంది.