పార్టీకి పిలిచింది.. ప్రాణం తీసింది!
Bengaluru Crime: కర్ణాటక రాజధాని బెంగళూరులో వెలుగుచూసిన ఒక హత్యోదంతం స్థానికంగా పెను సంచలనం సృష్టించింది.
పార్టీకి పిలిచింది.. ప్రాణం తీసింది!
Bengaluru Crime: కర్ణాటక రాజధాని బెంగళూరులో వెలుగుచూసిన ఒక హత్యోదంతం స్థానికంగా పెను సంచలనం సృష్టించింది. తన పెళ్లికి అడ్డుగా ఉన్నాడన్న కారణంతో ఒక టీవీ నటి, తన లివ్-ఇన్ పార్ట్నర్ను అత్యంత కిరాతకంగా హతమార్చింది. ఈ ఘటన ఫిబ్రవరి 18న మంజునాథనగర్లో జరగ్గా.. దాదాపు 12 రోజుల తర్వాత మృతదేహం కుళ్ళిపోయిన స్థితిలో లభ్యం కావడంతో అసలు విషయం బయటపడింది.
హత్యకు దారితీసిన కారణాలు:
పోలీసుల కథనం ప్రకారం.. టీవీ నటి ఊర్మిళ అలియాస్ బిందు, మోహన్ కృష్ణా రావు (40) గత కొంతకాలంగా మంజునాథనగర్లోని ఒక ఇంట్లో 'లివ్-ఇన్' రిలేషన్షిప్లో ఉంటున్నారు. అయితే, బిందు తాజాగా వినయ్ అనే లారీ డ్రైవర్ను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంది. దీనికి మోహన్ రావు అభ్యంతరం తెలపడంతో, అతడిని అడ్డుతొలగించుకోవాలని బిందు ప్లాన్ వేసింది.
పార్టీ అని పిలిచి.. ప్రాణం తీసి:
పథకం ప్రకారం ఫిబ్రవరి 18న బిందు తన ఇంట్లోనే మద్యం పార్టీ ఏర్పాటు చేసింది. మోహన్ రావు మద్యం మత్తులో ఉన్న సమయంలో బిందు కాబోయే భర్త వినయ్, అతని స్నేహితుడు ధనుష్తో కలిసి దాడి చేశారు. మోహన్ రావు కాళ్లు చేతులు కట్టేసి, ఊపిరి ఆడకుండా ముక్కు, నోటికి టేపులు వేశారు. ఆపై కత్తితో పలుమార్లు పొడవడంతో మోహన్ రావు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. హత్య అనంతరం నిందితులు ఇంటికి తాళం వేసి పరారయ్యారు.
దుర్వాసన రావడంతో వెలుగులోకి..
హత్య జరిగిన 12 రోజుల తర్వాత ఆ ఇంటి నుండి తీవ్రమైన దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లిన పోలీసులకు పూర్తిగా కుళ్ళిపోయిన స్థితిలో మోహన్ రావు మృతదేహం కనిపించింది.
ముగ్గురు నిందితుల అరెస్ట్:
ఈ కేసును ఛేదించిన నార్త్-వెస్ట్ డీసీపీ డీఎల్ నాగేష్ బృందం.. నటి బిందు, ఆమె ప్రియుడు వినయ్, ధనుష్లను అరెస్ట్ చేశారు. నిందితురాలు బిందు గతంలో 'భజరంగి', 'పోలీస్ క్వార్టర్స్', 'కాలభైరవ' వంటి సినిమాల్లో చిన్న పాత్రలు పోషించింది. ప్రస్తుతం పోలీసులు వీరిపై హత్య కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.