Rajasthan: పెళ్లికి పిలిచి కరోనా అంటించారని.. వరుడు కుటుంబానికి రూ.6 లక్షల జరిమానా

Rajasthan: దేశవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులు కలకలం రేపుతున్నాయి.

Update: 2020-06-28 05:28 GMT
Representational Image

Rajasthan: దేశవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులు కలకలం రేపుతున్నాయి. రోజురోజుకు భారీగా పెరుగుతున్న కరోనా కేసులతో జనం ఆందోళనల వ్యక్తం చేస్తున్నారు. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వైరస్‌ను నియంత్రనకు లాక్‌డౌన్ విధించడంతో పాటు నిబంధనలు పాటించాలని వెల్లడించాయి. అయితే ఇలాంటి సమయంలో బాధ్యతాయుతంగా కోవిడ్ నిబంధనలు పాటించాల్సిన పౌరులు వాటిని పక్కన పెడుతున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కరోనా వైరస్ వ్యాప్తికి కారకలవుతున్నారు.

కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి ఓ పెళ్లిలో 15 మందికి కరోనా సోకడానికి కారణమైన ఓ కుటుంబానికి అధికారులు భారీ జరిమానా విధించారు. దీంతో వరుడు కుటుంబానికి అధికారులు ఏకంగా ఆరు లక్షల రూపాయలు ఫైన్ వేశారు. ఈ ఘటన రాజస్థాన్‌లోని భిల్వారా జిల్లాలో జరిగింది. జిల్లాకు చెందిన గీసులాల్ రాఠీ ఈ నెల 13న తన కుమారుడికి వివాహం జరిపించాడు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం..

కరోనా కారణంగా వివాహానికి 50 మంది అతిథులు మాత్రమే పాల్గొనేందుకు అనుమతులు విధించిన విషయం తెలిసిందే. అయితే గీసులాల్ నిబంధనలు పక్కనపెట్టి ఈ పెళ్లికి పెద్ద సంఖ్యలో అతిథులను ఆహ్వానించాడు. పెళ్లికి హాజరైన వారిలో 15 మందికి కరోనా సోకినట్లు తేలింది. కరోనా సోకిన వారిలో ఒకరు చనిపోయారు. దీంతో ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన పోలీసులు ఈ నెల 22న గీసులాల్‌పై కేసు నమోదు చేశారు.

మరోవైపు, కరోనా వైరస్ సోకిన వారిని ప్రభుత్వ ఐసోలేషన్ సెంటర్లకు తరలించి చికిత్స అందించారు. కరోనా బాధితులకు పరీక్షల నిర్వహణ, చికిత్స, ఆహారం, అంబులెన్స్‌ తదితర వాటికి మొత్తంగా రూ.6,26,600 అయింది. దీంతో ఈ మొత్తాన్ని గీసులాల్ కుటుంబం నుంచి వసూలు చేయాలని, ఆ మొత్తాన్ని ముఖ్యమంత్రి సహాయనిధికి ఇవ్వాలని కలెక్టర్ రాజేంద్ర భట్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.


Tags:    

Similar News