Cryptocurrency Fraud: క్రిప్టో కరెన్సీ మోసం కేసులో కాజల్, తమన్నాలను విచారించనున్న పోలీసులు
Cryptocurrency Fraud: పుదుచ్చేరిలో జరిగిన క్రిప్టో కరెన్సీ మోసానికి సంబంధించిన కేసులో సినీతారలు తమన్నా, కాజల్ అగర్వాల్ లను విచారించాలని నిర్ణయించారు పుదుచ్చేరి పోలీసులు. క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెడితే అధిక లాభం పొందవచ్చని ఆశ చూపి పుదుచ్చేరికి చెందిన 10 మంది నుంచి సుమారు రూ. 2.40కోట్లు వసూలు చేసి మోసానికి పాల్పడినట్లు అశోకన్ అనే రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి ఫిర్యాదు చేశారు. క్రిప్టో కరెన్సీ కంపెనీ 2022లో కోయంబత్తూరు ప్రధాన కార్యాలయాంగా ప్రారంభం అయ్యింది. ప్రారంభోత్సవ కార్యక్రమంలో సినీనటి తమన్నా, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
మహాబలిపురంలోని ఓ స్టార్ హోటల్ లో జరిగిన ఈ కంపెనీ కార్యక్రమానికి నటి కాజల్ హాజరయ్యారు. ఆ తర్వాత ముంబైలో పార్టీ నిర్వహించి వేలాది మంది నుంచి డబ్బు సేకరించారు. ఈ ఘటనకు సంబంధించి నితీష్ జెయిన్, అరవింద్ కుమార్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా తమన్నా, కాజల్ అగర్వాల్ లను విచారించాలని పోలీసులు నిర్ణయించారు.