భారత్-చైనా ఆర్మీ మధ్య లడక్లోని గాల్వన్ లోయ ప్రాంతంలో జరిగిన యుద్దంలో తెలంగాణకు చెందిన కల్నల్ సహ 20 మంది సైనికులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం(జూన్ 19) సాయంత్రం 5 గంటలకు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ సమావేశంలో ప్రస్తుతం దేశ సరిహద్దులో ఎలాంటి పరిస్థితులు నెలకొంటున్నాయనే విషయాలపై చర్చించి అభిప్రాయాలు తీసుకోనున్నారు. దేశంలోని అన్ని పార్టీల అధ్యక్షులు ఈ వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొని తమ అభిప్రాయాలు తెలియజేయాల్సిందిగా ప్రధాని కార్యాలయం బుధవారం ట్వీట్ చేసింది.
తూర్పు లడఖ్లోని గాల్వన్ వ్యాలీలో జరిగిన పోరాటంలో ఇరుదేశాల సైనికులు పరస్పరం రాళ్లు, కర్రలు, ఇనుప రాడ్లతో దాడి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ దాడిలో ఇప్పటివరకు వచ్చిన సమాచారం మేరకు 45 మంది చైనా సైనికులు మరణించి ఉంటారని లేదా గాయపడి ఉండవచ్చని తెలుస్తోంది.