క్లైమాక్స్‌కు చేరిన 'నిర్భయ' నిందితుల ఉరిశిక్ష వ్యవహారం

Update: 2020-02-05 10:15 GMT

నిర్భయ కేసులో దోషుల ఉరిశిక్ష అమలు జాప్యంపై ఢిల్లీ హైకోర్టు సీరియస్ అయింది. దోషుల మరణ శిక్షను వాయిదా వేయడాన్ని సవాల్‌ చేస్తూ కేంద్రం, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు బుధవారం కొట్టివేసింది. అధికారుల నిర్లక్ష్యం వల్లే రివ్యూ పిటిషన్లపై జాప్యం జరిగిందని వ్యాఖ్యానించింది ధర్మాసనం. ఒకే కేసులో దోషులైన వారికి ఒకేసారి శిక్ష అమలు చేయాలన్న నిబంధనను అనుసరిస్తూ.. నిర్భయ కేసులో కూడా నలుగురికీ ఒకేసారి శిక్ష అమలు చేయాలంటూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. దీంతో నిందితులకు న్యాయపరమైన అంశాలను వారంలోగా పూర్తి చేసుకోవాలని వారంరోజుల గడువు కూడా ఇచ్చింది. ఈ సందర్బంగా మరణశిక్షలను సుప్రీంకోర్టు సమర్థించినా.. 2017 మే నుంచి ప్రభుత్వం, ఇతర అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. "మే 2017 నుండి అధికారులు నిద్రపోతున్నారా? అని ధర్మాసనం పేర్కొంది.

ఇదిలావుండగా, నిర్భయ దోషులను త్వరలోనే ఉరితీస్తామని న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ లోక్‌సభకు హామీ ఇచ్చారు. "మేము ఈ విషయంలో చాలా కఠినంగా ఉన్నాము ... ఆమెకు న్యాయం జరుగుతుంది. దోషులను త్వరలో ఉరి తీస్తాము అని మంత్రి.. సభలో తెలిపారు. గత వారం శుక్రవారం, ట్రయల్ కోర్టు నలుగురు దోషులపై మరణ శిక్ష అమలును వాయిదా వేసింది.

కాగా నిర్భయ సామూహిక అత్యాచారం, హత్య కేసులో నలుగురు దోషులు ఉద్దేశపూర్వకంగానే శిక్ష అమలును వాయిదా వేసేందుకు ప్రయత్నిస్తున్నారని, ఈ చర్య న్యాయ వ్యవస్థను అపహాస్యం చేయడమే అంటూ పిటిషనర్ల తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదించిన విషయం తెలిసిందే. దోషులను ఉరి తీయకపోవడం సమాజానికి తప్పుడు సందేశాన్ని పంపినట్టవుతుందని అని తుషార్‌ మెహతా అన్నారు. ఈ సందర్బంగా ఇటీవల హైదరాబాద్‌లో గత ఏడాది జరిగిన పోలీసు "ఎన్‌కౌంటర్" ను ఆయన ఉదహరించారు. దిశ అత్యాచారం-హత్య కేసులో నలుగురు నిందితులను హత్య చేసిన ప్రదేశానికి తీసుకెళ్లి విచారిస్తుండగా.. నిందితులు పారిపోయే ప్రయత్నం చేశారు దాంతో వారిని కాల్చి చంపిన వ్యవహారం పెద్ద సంచలనమే అయింది.

Tags:    

Similar News