PM Modi: మళ్లీ భూప్రకంపనలు వచ్చే అవకాశం ఉంది.. జాగ్రత్తగా ఉండండి: ప్రధాని మోదీ
PM Modi: దేశ రాజధాని ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో సోమవారం భూంకంపం సంభవించింది. తెల్లవారుజామున 5.30గంటల ప్రాంతాంలో భూప్రకంపనలు చోటుచేసుకోవడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. దీనిపై ప్రధాని మోదీ కూడా స్పందించారు. ప్రజలంతా జాగ్రత్తలు పాటించాలని పిలుపునిచ్చారు. మళ్లీ ప్రకంపనలు వచ్చే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ సూచించారు.
ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్, ప్రాంతాల్లో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.0గా నమోదు అయ్యింది. ధౌలా కాన్ లోని దుర్గాబాయ్ దేశ్ ముఖ్ కాలేజీ సమీపంలో 5 కిలోమీటర్ల భూకంపకేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ప్రకంపనలు సంభవించిన సమయంలో భారీ శబ్దం వినిపించడంతో ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఇప్పటి వరకు ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు. దీనిపై ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా స్పందించారు. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలి. భద్రతా చర్యలు పాటించాలి. మళ్లీ ప్రకంపనలు వచ్చే అవకాశం ఉండటంతో పరిస్థితులను అధికారులు సునిశితంగా పరిశీలిస్తున్నారని మోదీ వెల్లడించారు.