Coronavirus: మొబైల్ విధానంలో కరోనా పరీక్షలు.. చెన్నై లో ఏర్పాట్లు
వీలైనంత ఎక్కువ స్థాయిలో పరీక్షలు నిర్వహించి రోగులను ఎంపిక చేసేందుకు తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించింది.
వీలైనంత ఎక్కువ స్థాయిలో పరీక్షలు నిర్వహించి రోగులను ఎంపిక చేసేందుకు తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగా కేసులు తీవ్రంగా ఉన్న చెన్నై లో మొబైల్ పద్ధతిగా ద్వారా ఇంటింటికి వెళ్లి పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ విధానంతో అనుకూల ఫలితాలొస్తే రాష్ట్రమంతటా విస్తరించేందుకు సన్నాహాలు చేస్తోంది.
తమిళనాడును కరోనా వైరస్ వణికిస్తోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య అంతకంతకు పెరుగుతుండటంతో తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా వ్యాప్తి కట్టడికి తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని చెన్నైలో కరోనా వైరస్ను అరికట్టే దిశగా అన్నాడీఎంకే ప్రభుత్వం సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. ఇక కరోనా పరీక్షలను ప్రతి ఇంటికి వెళ్లి చేపట్టాలని సంకల్పించింది. దీని కోసం 81 సంచార వైద్యశాలలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రతి అంబులెన్స్లోనూ కరోనా పరీక్షలకు సంబంధించిన పరికరాలతో ఓ వైద్యుడు, నర్సు, ల్యాబ్ అసిస్టెంట్ ఉంటారు.
గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ పరిధిలోని 15 జోన్లు ఉన్నాయి. ఈ అంబులెన్స్లోని రక్షణకవచాలు ధరించిన వైద్యసిబ్బంది స్థానికులకు కొవిడ్ పరీక్షలు జరుపుతారు. ఈ సంచార వైద్యశాలలను రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి విజయభాస్కర్ ప్రారంభించారు. ఇక నుంచి 81 ప్రత్యేక అంబులెన్స్లు సంచార వైద్య శాలలుగా పనిచేస్తాయని మంత్రి విజయభాస్కర్ తెలిపారు. ఇకపై నగరవాసులెవరూ కరోనా వైద్యపరీక్షల కోసం ప్రభుత్వ ఆస్పత్రుల వరకు వెళ్ళాల్సిన అవసరమే ఉండదన్నారు. రాష్ట్రంలోనూ, చెన్నైలో కరోనా పాజిటివ్ కేసులు అధికంగా ఉండటటానికి ప్రతిరోజూ అత్యధిక సంఖ్యలో పరీక్షలు నిర్వహిస్తుండటమే కారణమని మంత్రి తెలిపారు.