Maratha Reservation: మహారాష్ట్రలో రిజర్వేషన్ చిచ్చు.. బీడ్ జిల్లా కేంద్రంలో విధ్వంసం.. ఎమ్మెల్యేల ఇళ్లపై నిరసనకారుల దాడులు
Maratha Reservation: విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్
Maratha Reservation: మహారాష్ట్రలో మరాఠా ఉద్యమం ఉధృతంగా మారుతోంది. విద్యా, ఉద్యోగాల్లో మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించాలని ఆందోళనలు చేస్తున్నారు. తాజా నిరసనలతో మహారాష్ట్రలో ఆదివారం 13 బస్సులు ధ్వంసమయ్యాయి. ఆందోళనకారులు బీడ్ జిల్లాలోని పలువురు ఎమ్మెల్యేల ఇళ్లపై దాడులకు పాల్పడ్డారు. దీంతో బీడ్ జిల్లాలో పోలీసులు కర్ఫ్యూ విధించారు.
మరోవైపు మరాఠా రిజర్వేషన్ల నిరసనల సెగ ప్రభుత్వానికి తాకింది. తప్పనిసరి పరిస్తితుల్లో ముఖ్యమంత్రి షిండే వర్గానికి చెందిన ఇద్దరు ఎంపీలు రాజీనామా సమర్పించారు. హింగోళి ఎంపీ హేమంత్ పాటిల్ తన రాజీనామా లేఖను లోక్సభ సెక్రటేరియట్కు పంపగా.. నాసిక్ ఎంపీ హేమంత్ గాడ్సే తన లేఖను ఏక్నాథ్ షిండేకు పంపారు. నిరసనకారులు హేమంత్ పాటిల్ను అడ్డుకుని రిజర్వేషన్లపై వైఖరి తెలియజేయాలని డిమాండ్ చేయడంతో ఆయన అక్కడికక్కడే రాజీనామా చేశారు. మరో ఎంపీని కూడా నాసిక్లో నిరసనకారులు వైఖరి తెలియజేయాలని పట్టుబట్టడంతో రాజీనామా చేశారు. వీలైనంత త్వరగా మరాఠా వర్గానికి రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ హేమంత్ గాడ్సే.. సీఎం ఏక్నాథ్ షిండేను కోరారు.