Mamata Banerjee: బెంగాల్లో కాంగ్రెస్కు ఒక్క సీటు కూడా ఇవ్వం
Mamata Banerjee: ఇవాళ సీపీఎంతో పొత్తు పెట్టుకున్న వాళ్లు... రేపు బీజేపీతో కూడా పొత్తు పెట్టుకుంటారు
Mamata Banerjee: పశ్చిమబెంగాల్లో రాహుల్ గాంధీ భారత్ జోడా న్యాయ్ యాత్ర నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని మరోసారి టార్గెట్ చేశారు తృణమూల్ అధినేత్రి, బెంగాల్ సీఎం మమత బెనర్జీ. బెంగాల్లో కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. సీపీఎంతో కాంగ్రెస్ పార్టీ పొత్తును కంటిన్యూ చేస్తే.. కాంగ్రెస్కు తృణమూల్ నుంచి ఎలాంటి మద్దతూ లభించదన్నారు. ఇవాళ సీపీఎంతో పొత్తు పెట్టుకున్న వాళ్లు, రేపు బీజేపీతోనూ పొత్తు పెట్టుకునే అవకాశాలున్నాయని విమర్శలు గుప్పించారు.
సీపీఎం అధికారంలో ఉండగా తనపై భౌతిక దాడులకు పాల్పడ్డారని.. తన శ్రేయోభిలాషల వల్లే తాను క్షేమంగా ఉన్నట్లు పేర్కొన్నారు. అలాంటి సీపీఎంతో కాంగ్రెస్ పార్టీ నడుస్తానంటే.. తన నుంచి ఆ పార్టీకీ ఎలాంటి సహకారం లభించదన్నారు. గతంలో తాము రెండు ఎంపీ సీట్లను ఇస్తామని ప్రతిపాదిస్తే.. కాంగ్రెస్ పార్టీ తిరస్కరించిందని మమత గుర్తు చేశారు. బెంగాల్లో క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్కు పట్టు లేదని.. అలాంటి కాంగ్రెస్ పార్టీకి చేయూతనిస్తానంటే ఆ పార్టీ నేతలే వద్దాన్నారని సీఎం మమత ఎద్దేవా చేశారు.