రేపు మధ్యప్రదేశ్ అసెంబ్లీలో విశ్వాసపరీక్ష.. కాంగ్రెస్ కు షాకే..

మధ్యప్రదేశ్ అసెంబ్లీలో మార్చి 16న విశ్వాసపరీక్ష జరుగుతుందని రాష్ట్ర గవర్నర్ లాల్జీ టాండన్ తెలిపారు.

Update: 2020-03-15 02:59 GMT
kamal Nath

మధ్యప్రదేశ్ అసెంబ్లీలో మార్చి 16న విశ్వాసపరీక్ష జరుగుతుందని రాష్ట్ర గవర్నర్ లాల్జీ టాండన్ తెలిపారు.బిజెపి ప్రతినిధి బృందం శనివారం గవర్నర్‌ను కలుసుకుని అసెంబ్లీలో విశ్వాసపరీక్ష నిర్వహించాలని కోరిన తరువాత ఈ నిర్ణయం వెలువడింది. గవర్నర్‌ను కలిసిన ప్రతినిధి బృందంలో బిజెపి నాయకులు గోపాల్ భార్గవ, శివరాజ్ సింగ్ చౌహాన్, నరోత్తం మిశ్రా, భూపేంద్ర సింగ్ ఉన్నారు. వీరిలో శివరాజ్ సింగ్ చౌహాన్ కు తదుపరి ముఖ్యమంత్రి అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. గవర్నర్ ను కలిసిన అనంతరం శివరాజ్ సింగ్ చౌహన్ మాట్లాడుతూ.. 'మా బృందంలో గవర్నర్‌ను కలిసిన వారిలో ఇతర పార్టీ సభ్యులు ఉన్నారు, ఇప్పటికే ప్రభుత్వానికి వ్యతిరేకంగా 22 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు.

ప్రస్తుతం కమల్ నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్యేల విశ్వాసం కోల్పోయింది. అందువలన కమల్ నాధ్ ప్రభుత్వానికి అసెంబ్లీలో విశ్వాసపరీక్ష నిర్వహించాలని మేము గవర్నర్‌కు ఒక లేఖను సమర్పించాము.. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యే లోగా ఫ్లోర్ టెస్ట్ నిర్వహించాలని డిమాండ్ చేశాము' అని చౌహాన్ విలేకరులతో అన్నారు. అంతేకాదు 'కమల్ నాథ్ నేతృత్వంలోని ప్రభుత్వం ఇప్పుడు మైనారిటీలో ఉంది. రాష్ట్రాన్ని నడిపేందుకు ప్రభుత్వానికి రాజ్యాంగబద్ధమైన అధికారం లేదు. నిర్ణయాలు తీసుకునే అధికారం వారికి లేదు. వారు మొదట అసెంబ్లీలో విశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోవాలి' అని అన్నారు.

కాగా ఆరుగురు మంత్రులతో సహా 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మార్చి 10 న శాసనసభకు రాజీనామా చేశారు. జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన వెంటనే శాసనసభ్యులు తమ రాజీనామా లేఖలను గవర్నర్ కు పంపారు. ఆ తరువాత సింధియా బిజెపిలో చేరారు. మధ్యప్రదేశ్‌లో 2018 లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటి అంతర్గత విబేధాలు నెలకొన్నాయి. ముఖ్యమంత్రి పదవి తనకు ఇవ్వలేదన్న కారణంగా జ్యోతిరాదిత్య సింధియా పలుమార్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఇటీవల ఆ పార్టీకి గట్టి షాక్ ఇచ్చారు. ఈ పరిణామాలను ముందుగా అంచనా వేయకుండా కాంగ్రెస్ పార్టీ ఇబ్బందుల్లో పడింది.


Tags:    

Similar News