JEE Mains 2022: జేఈఈ మెయిన్‌ మరోసారి వాయిదా

JEE Mains 2022: *తొలిసెషన్‌ జూన్‌ 20 నుంచి 29 వరకు *రెండో సెషన్‌ జూలై 21 నుంచి 30 వరకు

Update: 2022-04-07 01:00 GMT

JEE Mains 2022: జేఈఈ మెయిన్‌ మరోసారి వాయిదా 

JEE Mains 2022: ఐఐటీ, ఎన్‌ఐటీ, ఐఐఐటీ తదితర జాతీయ విద్యా సంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించే జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ మెయిన్‌ను ఎన్టీఏ వాయిదా వేసింది. దేశవ్యాప్తంగా విద్యార్థుల నుంచి వస్తోన్న విన్నపాలను పరిశీలించిన ఎన్టీఏ జేఈఈ పరీక్షలను వాయిదా వేసింది. తొలి విడత పరీక్షలను జూన్‌లో, రెండో విడత జులైలో నిర్వహించనుంది. తొలివిడత పరీక్షల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మంగళవారంతో ముగిసింది. బుధవారం నుంచి దరఖాస్తుల్లో సవరణలకు అవకాశం ఇచ్చారు. రెండో విడత రిజిస్ట్రేషన్ల ప్రక్రియ త్వరలోనే ప్రారంభమవుతుంది.

సీబీఎస్‌ఈతో పాటు పలు రాష్ట్రాల ఇంటర్‌ బోర్డులు, హయ్యర్‌ సెకండరీ బోర్డుల పరీక్షలు ఏప్రిల్, మే నెలల్లో జరుగుతున్నాయి. అదే సమయంలో జేఈఈ మెయిన్‌ కూడా జరుగుతుండడంతో విద్యార్థులు గందరగోళంలో పడ్డారు. 2 పరీక్షలూ కీలకమైనవి కావడంతో దేనిపై దృష్టి పెట్టాలో తెలియక ఒత్తిడికి లోనవుతున్నారు. జేఈఈ షెడ్యూల్‌ దృష్ట్యా బోర్డు పరీక్షలు ఇప్పటికే 2 సార్లు మారాయి. ఇంటర్‌ పరీక్షలు నెల పాటు ఆలస్యమయ్యాయి. ఏపీలో ఏప్రిల్‌ 8 నుంచి 28 వ తేదీవరకు ఇంటర్‌ పరీక్షలు జరగాల్సి ఉండగా జేఈఈ తొలి షెడ్యూల్‌ ను జూన్‌ 20 నుంచి 29 వరకు నిర్వహించనున్నారు.

జేఈఈ మెయిన్‌ వాయిదా ప్రభావం జేఈఈ అడ్వాన్స్‌డ్‌పైనా పడుతోంది. జూలై 3 న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష నిర్వహించాలని ముంబై ఐఐటీ ఇంతకు ముందే షెడ్యూల్‌ ప్రకటించింది. ఇప్పుడు జేఈఈ మెయిన్‌ పరీక్షలు జూలై 21 నుంచి 30వ తేదీవరకు జరుగనున్నాయి. ఆ పరీక్షల ఫలితాలు వెల్లడైతేనే అడ్వాన్స్‌డ్‌ నిర్వహించేందుకు వీలుంటుంది. ఆగస్టు చివరి వారం లేదా సెప్టెంబరు మొదటి వారంలో అడ్వాన్స్‌డ్‌ పరీక్ష జరుగుతుందని భావిస్తున్నారు. 

Tags:    

Similar News