ISRO: ఇస్రో వందో ప్రయోగం విజయవంతం అయ్యింది. శ్రీహరికోటలోని షార్ నుంచి జీఎస్ఎల్ వీ ఎఫ్ 15 రాకెట్ ను ప్రయోగించారు. ఈ రాకెట్ ఎన్ వీఎస్ 02 ఉపగ్రహాన్ని తీసుకుని నింగిలోకి దూసుకెళ్లింది. ఉపగ్రహం విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశించింది.
ఎన్ వీఎస్ 02 ఉపగ్రహం..ఇస్రో శాస్త్రవేత్తలు డెవలప్ చేసిన స్వదేశీ నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ. దీని బరువు 2,250 కిలోలు ఉంటుంది. ఇది కొత్త తరం నావిగేషన్ ఉపగ్రహాల్లో రెండోది. ఇస్రో చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన వి. నారాయణన్ కు ఇది మొదటి ప్రయోగం కావడంతో ఆయనే స్వయంగా అన్ని ప్రక్రియలనూ పర్యవేక్షించారు. భౌగోళిక, వైమానిక, సముద్ర నావిగేషన్ సేవల కోసం ఈ ఉపగ్రహ ప్రయోగం ఉపయోగపడుతుంది. వ్యవసాయంలో సాంకేతిక, విమానాల నిర్వహణ, మొబైల్ పరికరాల్లో లోకేషన్ ఆధారిత సేవలను అందిస్తుంది.
ఇస్రో శాస్త్రవేత్తలకు చైర్మన్ నారాయణన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంవత్సరం చేపట్టిన తొలి ప్రయోగం విజయవంతమైందని తెలిపారు. నావిగేషన్ శాటిలైట్ ను నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టినట్లు వివరించారు. ఈ వందో ప్రయోగం మైలురాయిగా నిలుస్తుందని తెలిపారు.