India: అత్యంత కాలుష్య దేశాల్లో 3వ స్థానంలో భారత్
India: మొదటి రెండు స్థానాల్లో బంగ్లాదేశ్, పాకిస్థాన్
India: అత్యంత కాలుష్య పూరిత దేశాల్లో భారత్ మూడో స్థానంలో నిలిచింది. 134 దేశాల్లోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 30 వేలకుపైగా గాలి నాణ్యత పర్యవేక్షణ కేంద్రాల నుంచి సేకరించిన అంకెల ప్రకారం.. 2023 సంవత్సరానికి ప్రపంచ గాలి నాణ్యత నివేదికను విడుదల చేశారు. వార్షిక పీఎం 2.5 కాలుష్య గాఢత క్యూబిక్ మీటరుకు 79.9 మైక్రోగ్రాములతో బంగ్లాదేశ్ అత్యంత కాలుష్య భరిత దేశంగా మొదటి స్థానంలో నిలిచింది. 73.7 మైక్రోగ్రాములతో పాకిస్థాన్ రెండో స్థానంలో, 54.4 మైక్రోగ్రాములతో భారత్ మూడో స్థానంలో నిలిచాయి.
2022 సంవత్సరంలో వార్షిక పీఎం 2.5 కాలుష్య గాఢత క్యూబిక్ మీటరుకు 53.3 మైక్రోగామ్రులతో భారత్ అత్యంత కాలుష్య దేశాల జాబితాలో ఎనిమిదో స్థానంలో ఉంది. తాజా జాబితాలో ప్రపంచంలోనే అత్యంత కాలుష్య 50 నగరాలలో 42 భారతదేశంలోనే ఉండటం గమనార్హం. పీఎం2.5 కాలుష్య గాఢత క్యూబిక్ మీటరుకు 92.7 మైక్రోగ్రాములతో న్యూఢిల్లీ ప్రపంచంలోనే కాలుష్యపూరిత రాజధానుల్లో మొదటిస్థానంలో నిలిచింది. బిహార్లోని పారిశ్రామిక నగరం బెగుసరాయ్ పీఎం2.5 కాలుష్య గాఢత క్యూబిక్ మీటరుకు 118.9 మైక్రోగ్రాములతో ప్రపంచంలోనే అత్యంత కాలుష్యపూరిత నగరంగా మొదటి స్థానంలో నిలిచింది.
105.4 మైక్రోగ్రాములతో గువాహటీ రెండో స్థానం, 102.1 మైక్రోగ్రాములతో ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతం మూడో స్థానం, 100.4 మైక్రోగ్రాములతో పంజాబ్లోని ముల్లాన్పూర్ నాలుగోస్థానం, 99.5 మైక్రోగ్రాములతో పాకిస్థాన్లోని లాహోర్ నగరం ఐదో స్థానం, 92.7 మైక్రోగ్రాములతో న్యూఢిల్లీ 6వ స్థానంలో నిలిచాయి. అలాగే, 88.6 మైక్రోగ్రాములతో గ్రేటర్ నోడియా 11వ స్థానం, 84 మైక్రోగ్రాములతో గురుగ్రామ్ 17వ స్థానంలో నిలిచాయి.