నవీ ముంబైలోని ఓ భవనంలో మంటలు చెలరేగాయి. ఈ ఉదయం 7 గంటల ప్రాంతంలో ముంబైలోని సీవుడ్స్ ప్రాంతంలోని సీ హోమ్స్ వద్ద 21 అంతస్తుల భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటల వ్యాప్తి కొన్ని అంతస్తులకు పాకింది. అయితే అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు.ఫైర్ ఇంజన్లు అక్కడికి చేరుకున్నాయి. మంటలను అదుపుచేసేందుకు ఫైర్ సిబ్బంది తీవ్రంగా కృషి చేస్తోంది. మంటలు పక్క భవనాలకు తాకకుండా భారీ నీటి పైపులతో ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.
మరోవైపు ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ముందు జాగ్రత్తగా ఆ ప్రాంతంలో ఉన్న జనాలను ఖాళీ చేయించారు. చిన్నపిల్లలను ఎక్కడికి వెళ్లనీయలేదు. ఈ ఘటనకు షార్ట్ సర్క్యూటే కారణమని భావిస్తున్నారు. అయితే దీనిపై ఇంకా దర్యాప్తు మొదలుపెట్టలేదు. మంటలు పూర్తిస్థాయిలో అదుపులోకి వచ్చిన తరువాతే భవనాలను పరిశీలించనున్నారు పోలీసులు. ఇక ఈ ఘటనతో ఆ ప్రాంత ప్రజలు ఒక్కసారిగా ఉలికిపాటుకు గురయ్యారు.