జమైకాలోనే కాదు భారత్లోనూ ఓ ఉసేన్ బోల్ట్ ఉన్నాడు.. ఇప్పటివరకు ప్రపంచంలో అత్యంత వేగంగా పరిగెత్తే వీరుడు ఎవరంటే అందరూ టక్కున చెప్పే పేరు ఉసేన్ బోల్ట్.. అతను 100 మీటర్లు రేసును కేవలం 9.58 సెకన్లలోనే పూర్తి చేసిన ఒకేఒక్క అథ్లెట్గా నిలిచాడు. అయితే అతడిని మించిన వేగంతో భారత్లో రాత్రికి రాత్రే పెద్ద అథ్లెట్గా రికార్డు సృష్టించాడు ఓ వ్యక్తి. ఇప్పుడు అతన్ని యావత్ భారత ప్రజలు కొనియాడుతున్నారు. కర్ణాటకలోని కంబళ పోటీల్లో ఉసేన్ బోల్ట్ పరుగుతో రికార్డులను తుడిచిపెట్టాడు.
కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా మూదబిద్రకి చెందిన శ్రీనివాస గౌడ సంప్రదాయక కంబళ పోటీల్లో 142.5 మీటర్ల దూరాన్ని కేవలం 13.62 సెకన్లలోనే అధిగమించాడు. అది కూడా మామూలు నేల మీద కాదు బురద నీళ్లలో పరుగెత్తి ప్రపంచాన్ని ఆకర్షించాడు. రెండు దున్నలను కట్టేసి ఉంచిన తాడును పట్టుకుని ఈ పరుగు తీసి ఔరా అనిపించాడు.. శ్రీనివాస్ గౌడ 13.62 సెకన్లలో 142.50 మీటర్లు పరిగెత్తినప్పుడు, ప్రజలు అతని వేగం 100 మీటర్లకు ఎంత ఉంటుందో లెక్కించారు. ఇది కేవలం 9.55 సెకన్లు, బోల్ట్ రికార్డు కంటే.. 03 సెకన్లు ముందుగానే ఈ రికార్డును చేరుకున్నాడు.
ఈ ఘనత సాధించిన సందర్బంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. 'నేను కంబళను ప్రేమిస్తున్నాను. నా విజయంలోని ఈ ఘనత నా రెండు దున్నలకు కూడా దక్కాలి. అవి చాలా బాగా పరిగెత్తాయి. నేను వాటిని వెంబడించాను' అని చెప్పాడు.
అయితే బోల్ట్ 30 ఏళ్ల రికార్డును బద్దలు కొడుతూ అత్యంత వేగంగా పరిగెత్తిన వ్యక్తిగా నిలిచిన శ్రీనివాస్.. ఈ వీడియోను ఓ జర్నలిస్ట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇతడి గురించి అందరికీ తెలిసింది. దీంతో ఈ ఫీట్ ఇంటర్నెట్ లో తెగ వైరల్ అవుతోంది. ప్రపంచవ్యాప్తంగా అనేక వేల మంది దీనిని ట్విట్టర్ మరియు ఫేస్బుక్ ద్వారా వీక్షించారు. అలాగే ఈ రికార్డును నేరుగా బోల్ట్తో పోల్చలేమంటున్నారు కొందరు నెటిజన్లు. ఎందుకంటే శ్రీనివాస గౌడ వేగం అతడి దున్నల నుంచి వచ్చిందని అభిప్రాయపడుతున్నారు. ఏదిఏమైనా ఒలింపిక్స్ కోసం ప్రభుత్వం అతనికి శిక్షణ ఇవ్వాలని కొందరు సూచించారు.
కాగా కొంతమంది జంతు హక్కుల కార్యకర్తల ఒత్తిడితో, కంబళను కొన్ని సంవత్సరాల క్రితం నిషేధించారు, అయితే, అప్పటి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం దీనిని అనుమతించే ప్రత్యేక చట్టాన్ని ఆమోదించింది. కొన్ని కంబాలా ఈవెంట్లలో, బహుమతి డబ్బు లక్షలను దాటుతుంది.