చైనాతోపాటు ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కరోనా వైరస్ పై ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. ఇదే సందు అనుకోని సామాజిక మాధ్యమాల్లో ఫేక్ ప్రచారం చేస్తూ ప్రజల్ని మరింతగా భయపెడుతున్నారు 'భారత్లోకి కూడా ప్రవేశించిన చైనాలోని కరోనా వైరస్ పర్యవసానం ఇదీ' అంటూ ఫేస్బుక్లో పోస్ట్ చేసిన ఓ ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది. ఆ ఫొటోలో రోడ్డుమీద వందలమంది చనిపోయి పడిపోయినట్లు కనిపిస్తోంది. దీంతో ఈ ఫోటో చూసిన వారంతా ఆందోళనకు గురయ్యారు. జనం పిట్టల్లా రాలిపోతున్నారంటూ కామెంట్లు పెట్టారు. తీరా చూస్తే ఈ ఫోటో ఫేక్ అని తేలింది. వాస్తవానికి 1945, మార్చి 24వ తేదీన 'కట్చ్బాగ్' నాజీ కాన్సంట్రేషన్ క్యాంప్లో మరణించిన 528 ప్రజల సంస్మరణార్థం.. 2014 మార్చి 24వ తేదీన జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్ నగరంలో కళాకారుల బృందం చేసిన ప్రదర్శన ఇది.
నాటకంలో భాగంగా కళాకారులు ఇలా మృతుల్లా ప్రదర్శన ఇచ్చారు. ఈ ప్రదర్శనకు అప్పట్లో అవార్డులు కూడా వచ్చాయి. 2014, మార్చి 25వ తేదీన ఈ ఫొటోలను 'రాయిటర్స్ న్యూస్ ఏజన్సీ తోపాటు హిందుస్థాన్ టైమ్స్ కూడా ప్రచురించాయి. కాగా 1945 కాన్సంట్రేషన్ క్యాంప్లో దాదాపు 528 మంది మతదేహాలను ఫ్రాంక్ఫర్ట్ కేంద్ర స్మశానంలో పూడ్చిపెట్టారని ఈ నాటకం తరువాత తెలిసింది. ఇప్పుడు ఈ ఫొటోలనే కొంతమంది వైరల్ చేస్తున్నారు. మరోవైపు ఇలాంటి ఫేక్ ఫోటోలను ప్రచారం చేస్తే చర్యలు తప్పవని ఓ పక్క అధికారులు హెచ్చరిస్తున్నా కూడా ఇటువంటివి ఆగడం లేదు. అయితే సోషల్ మీడియాలో ఇటువంటి నకిలీ ఫొటోలను కనుక్కోవడానికి 'యాండెక్స్' అనే యాప్ అందుబాటులోకి వచ్చింది. దీని ద్వారా ఫోటో నకిలీదో, అసలుదో కనిపెట్టవచ్చు.