ఓటు వేసిన ప్రముఖులు.. ఓటర్లకు పలు సంస్థల ఆఫర్లు..
ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు 16 శాతం ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు 16 శాతం ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఆయన సతీమణి సవితా కోవింద్.. ప్రెసిడెంట్ ఎస్టేట్లోని డాక్టర్ రాజేంద్రప్రసాద్ కేంద్రీయ విద్యాలయలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఆయన సతీమణి గురుశరణ్ సింగ్.. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ నిర్మాణ్ భవన్లో ఓటు వేయగా.. ప్రియాంక గాంధీ, రాబర్ట్ వాద్రా.. లోధి ఎస్టేట్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన కుటుంబ సభ్యులతో కలిసి సివిల్ లైన్స్ పోలింగ్ బూత్లో ఓటు వేశారు.
ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా, ఆయన భార్య సీమ సిసోడియా.. పాండవ్ నగర్లోని ఎంసీడీ పాఠశాలలో ఓటు వేశారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్.. తుగ్లక్ క్రెసెంట్ ప్రాంతంలోని ఎన్ఎండీసీ పాఠశాలలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. అలాగే కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్థన్ తన తల్లితో కలిసి కృష్ణానగర్లోని రతన్ దేవి పబ్లిక్ స్కూల్లో ఓటు వేశారు. బీజేపీ ఎంపీ పర్వేష్ వర్మ.. మాటియాల నియోజవర్గంలో తన ఓటు వేశారు. జస్టిస్ ఆర్. భానుమతి.. తుగ్లక్ క్రెసెంట్ ప్రాంతంలోని ఎన్ఎండీసీ పాఠశాలలోని పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. హీరోయిన్ తాప్సీ పొన్ను తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. ఈ ఫొటోలను ఆమె తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు.
ఇదిలావుంటే ఢిల్లీలో ఎన్నికల సందర్భంగా పలు సంస్థలు ఓటర్లకు ఉచిత రవాణా సదుపాయం కల్పిస్తున్నాయి. ఇందులో ఆటోలు, బైక్లే కాదు స్పైస్ జెట్ విమానయాన సంస్థ కూడా ఉచిత సర్వీస్ అందిస్తోంది. 'అభీబస్ డాట్ కామ్' కూడా 'ఐ ఓట్ ఐ విన్' అనే నినాదంతో ఉచిత బస్సు సేవలను అందిస్తోంది. దీంతోపాటు ఈరోజు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఢిల్లీ ఓటర్లకు మూడు కిలోమీటర్ల పరిధిలో ఉన్న పోలింగ్ బూత్ వరకూ ఫ్రీ రైడింగ్ అవకాశం కల్పిస్తున్నట్టు బైక్-టాక్సీ బుకింగ్ యాప్ 'రాపిడో' ప్రకటించింది. కాగా 70 స్థానాలకు గాను 672 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.