ఈశాన్య ఢిల్లీలోని బాబర్పూర్ ప్రాథమిక పాఠశాలలో విషాదం చోటుచేసుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో విధులు నిర్వర్తించేందుకు వచ్చిన అధికారి గుండెపోటుతో మరణించారు. ఆయన బాబర్పూర్ పోలింగ్ కేంద్రంలో ఎన్నికల విధుల్లో ఉన్నారు. విధులు నిర్వహించడం కోసం ఉధమ్సింగ్ అనే అధికారి బాబర్పూర్ ప్రాథమిక పాఠశాలకు వచ్చారు. అయితే కొద్దేసేపటికే ఆయన కుప్పకూలారు. ఓటర్లు, ఇతర అధికారులు ఆయనను పిలవగా నోట మాట రాలేదు. దాంతో వైద్యులకు సమాచారం అందించగా వారు ఉధమ్సింగ్ ను పరీక్షించారు. అతను అప్పటికే మృతించెందినట్టు వైద్యులు నిర్ధారించారు. అతను గుండెపోటు కారణంగానే ప్రాణాలు కోల్పోయారని తేల్చారు. దాంతో భౌతిక కాయాన్ని పోలీసులు పోలింగ్ కేంద్రం నుంచి తరలించారు. ఎన్నికల అధికారి మరణంతో కాసేపు పోలింగ్కు అంతరాయం కలిగింది. తర్వాత యథావిధిగా పోలింగ్ కొనసాగింది.
ఢిల్లీలో ప్రస్తుతం పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. యమునా విహార్లోని సీ10 బ్లాక్ పోలింగ్ బూత్లో ఈవీఎంలు మొరాయించడంతో ఉదయం 9 గంటల తరువాత పోలింగ్ ప్రారంభమైంది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్.. తుగ్లక్ క్రెసెంట్ ప్రాంతంలోని ఎన్ఎండీసీ పాఠశాలలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. అలాగే కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్థన్ తన తల్లితో కలిసి కృష్ణానగర్లోని రతన్ దేవి పబ్లిక్ స్కూల్లో ఓటు వేశారు. బీజేపీ ఎంపీ పర్వేష్ వర్మ.. మాటియాల నియోజవర్గంలో తన ఓటు వేశారు. జస్టిస్ ఆర్. భానుమతి.. తుగ్లక్ క్రెసెంట్ ప్రాంతంలోని ఎన్ఎండీసీ పాఠశాలలోని పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా, జామియా నగర్ ప్రాంతంలో కఠినమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇక్కడి గుండా వెళుతున్న అన్ని రైళ్లను పోలీసులు తనిఖీ చేస్తున్నారు. 50 రోజులకు పైగా పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా జామియా నగర్ మరియు షాహీన్ బాగ్ ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సహా పలువురు నాయకులు ఓటు వేయాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. కాగా 70 స్థానాలకు గాను 672 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. మొదటిసారిగా, 2 లక్షలకు పైగా 80+ మరియు 50,000 మంది వికలాంగ ఓటర్లకు కూడా పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించారు.