పెరుగుతున్న కేసులను బట్టి అంచనా వేసుకుంటే జూలై చివరి నాటికి లక్షల్లో కేసులు నమోదవుతాయని ఢిల్లీ సర్కార్ ఒక ప్రాధమిక అంచనా వేసింది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో వీరందరికీ సరిపడా బెడ్స్ అందుబాటులో లేవని, వాటికి సన్నద్ధం అయ్యేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే ప్రస్తుతం 34,687 కేసులు నమోదవగా, 20,871 కేసులు యాక్టివ్ లో ఉన్నట్టు లెక్కలు చెబుతున్నాయి.
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. దేశంలో అత్యధిక కేసులు నమోదైన రాష్ట్రాల్లో టాప్-3 ఉన్న ఢిల్లీలో 9173 కరోనా బెడ్స్ అందుబాటులో ఉన్నాయి. కానీ వ్యాధి వ్యాప్తి, తీవ్రత చూస్తుంటే జులై నాటికి 1.60వేల కోవిడ్ బెడ్స్ కావాలని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
ఢిల్లీలో ఇతర రాష్ట్రాల నుండి వచ్చే కరోనా బాధితులకు చికిత్స చేయరాదని ఇది వరకు సీఎం కేజ్రీవాల్ ఆదేశించారు. జులై 31 వరకు ఢిల్లీ ప్రజల్లో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉండే అవకాశం ఉందని, జులై 31వరకు కేవలం ఢిల్లీ ప్రజలకే 80వేల కోవిడ్ బెడ్స్ కావాలని అంచనా వేశారు. దీంతో అంత భారీ స్థాయిలో బెడ్స్ ఏర్పాటు చేయలేమన్న ఉద్దేశంతో ఆప్ సర్కార్ ఢిల్లీయేతర ప్రజలకు కరోనా చికిత్స అందించరాదని నిర్ణయించింది. కానీ దీన్ని ఢిల్లీ లెఫ్టనెంట్ గవర్నర్ రద్దు చేశారు. దీన్ని కేజ్రీవాల్ సర్కార్ కూడా అంగీకరించింది. దీంతో అందరికీ వైద్యం అందించాలంటే జులై 31 నాటికి 1.60లక్షల బెడ్స్ అవసరం అవుతాయని ప్రభుత్వం భావిస్తుంది.
ఢిల్లీలో అతివేగంగా కరోనా వైరస్ వ్యాప్తి అవుతుందని… జూన్ 15 నాటికి 44వేలకు పైగా కేసులు, ఈ నెలాఖరు వరకు 1 లక్ష కేసుల వరకు వచ్చే అవకాశం ఉందని కేజ్రీవాల్ సర్కార్ అంచనా వేస్తోంది. ఇక జులై చివరి నాటికి ఒక్క ఢిల్లీలోనే 5లక్షల 32వేల కేసులు దాటుతాయని సంచలన అంశాలను ప్రకటించింది. ఇప్పటికే ఢిల్లీలో కొంతమందికి చికిత్స కోసం బెడ్స్ దొరకటం లేదని సీఎం కేజ్రీవాల్ స్వయంగా ప్రకటించారు.