కర్ణాటకలో కాంగ్రెస్ దూకుడు.. ఎన్నికల షెడ్యూల్కు ముందే అభ్యర్థుల ప్రకటన
Karnataka Elections: కర్ణాటకలో పాలిటిక్స్ రసవత్తరంగా మారాయి.
Karnataka Elections: కర్ణాటకలో పాలిటిక్స్ రసవత్తరంగా మారాయి. బీజేపీ నుంచి అధికారాన్ని చేజిక్కించుకోవాలని చూస్తున్న కాంగ్రెస్.. మైండ్ గేమ్ స్టార్ట్ చేసింది. ఏ పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించకముందే.. కనీసం షెడ్యూల్ కూడా ఇవ్వకముందే జాబితా విడుదల చేసి ప్రచారాన్ని మరింత ముమ్మరం చేస్తోంది. ఇప్పటికే ప్రచారాలు జోరందుకోగా.. మిగతా పార్టీల కంటే ముందే 124 మందితో తొలి జాబితా ప్రకటించేసింది. ప్రస్తుత శాసనసభ గడువు మేలో ముగియనుండగా ఏప్రిల్లో ఎన్నికలు జరగనున్నాయి.
కర్ణాటక కాంగ్రెస్ విడుదల చేసిన తొలి జాబితాలో కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్, మాజీ సీఎం సిద్ధరామయ్య, మల్లికార్జున్ ఖర్గే కుమారుడు పేర్లు కూడా ఉన్నాయి. మాజీ సీఎం సిద్ధరామయ్య వరుణ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. గతంలో చాముండేశ్వరి, వరుణ నియోజకవర్గాల్లో పోటీ చేసిన సిద్ధరామయ్య..2018లో తన కుమారుడు యతీంద్ర కోసం వరుణ స్థానాన్ని త్యాగం చేశారు. ఈ ఎన్నికల్లో కోలార్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావించారు. అయితే రాహుల్ గాంధీ సూచనతో మళ్లీ వరుణ నుంచే పోటీ చేస్తున్నారు సిద్ధరామయ్య. ఇక కనకపుర స్థానం నుంచి కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ పోటీ చేయనుండగా.. చీతాపూర్ నుంచి కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లిఖార్జున్ ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే పోటీ చేయనున్నారు.