Air India: టాయిలెట్ లలో సమస్యలు..10 గంటల ప్రయాణం తర్వాత వెనక్కి వచ్చిన షికాగో-ఢిల్లీ విమానం
Air India: షికాగో నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఎయిరిండియా విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో దాదాపు 10 గంటలు ప్రయాణించిన తర్వాత తిరిగి షికాగోకు మళ్లించినట్లు విమానయాన సంస్థ తెలిపింది. అందులోని టాయిలెట్లు మూసుకోవడం వల్లే విమానాన్ని వెనక్కి మళ్లించాల్సి వచ్చిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. బోయింగ్ 777-337 ఈఆర్ విమానం షికాగోలోని ఓఆర్ డి ఎయిర్ పోర్టు నుంచి ఢిల్లీకి బయలుదేరింది. మొత్తం 340 సీట్ల సామర్థ్యం ఉన్న ఈ విమానంలో పది మరుగుదొడ్లు ఉన్నాయి. అయితే విమానం బయలుదేరిన తర్వాత వీటిలో కేవలం ఒకటి మాత్రమే పనిచేస్తున్నట్లు గుర్తించారు. అప్పటికే పది గంటలు ప్రయాణించినప్పటికీ విమానాన్ని తిరిగి షికాగోకు మళ్లించారు.
షికాగో నుంచి డిల్లీకి వచ్చే ఏఐ126 ఎయిరిండియా విమానం మార్చి 6న సాంకేతిక కారణాలతో తిరిగి వెనక్కి పంపించినట్లు ఎయిరిండియా అధికార ప్రతినిధి వెల్లడించారు. ల్యాండ్ అయిన తర్వాత ప్రయాణికులు, సిబ్బందికి బస కల్పించామన్నారు. వారి గమ్య స్థానం చేరేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఎవరైనా ప్రయాణాన్ని రద్దు చేసుకుంటే పూర్తి మొత్తాన్ని తిరిగి చెల్లిస్తామని రీషెడ్యూల్ కూ అవకాశం కల్పించామని ఎయిరిండియా తెలిపింది.
ఎయిర్ ఇండియా తన కొన్ని విమానాలలో విమాన ప్రయాణ సమయంలో ఉచిత వై-ఫై సౌకర్యాన్ని అందించడం ప్రారంభించింది. కొత్త సంవత్సరం ప్రారంభంలో కంపెనీ దీనిని ప్రకటించింది. అయితే, ఎయిర్లైన్ ప్రస్తుతం ఎయిర్బస్ A350, బోయింగ్ 789-0, ఇతర ఎయిర్బస్ విమానాలలో Wi-Fi సౌకర్యాన్ని అందిస్తుంది. ఎయిర్ ఇండియా ఇప్పటికే న్యూయార్క్, లండన్, పారిస్, సింగపూర్ వంటి అంతర్జాతీయ మార్గాల్లో ఉచిత వై-ఫై సేవలను అందిస్తోంది. అయితే, దేశీయ విమానాల్లో ప్రయాణించే ఎయిర్ ఇండియా ప్రయాణీకులకు మొదటిసారిగా ఈ సౌకర్యం లభిస్తుంది.