West Bengal Election 2021: మమతా బెనర్జీ ఆడియో క్లిప్ కలకలం

Mamata Audio Clip: పశ్చిమ బెంగాల్ ఎన్నికలకు ముందు తృణమూల్‌ అధినేత మమతా బెనర్జీ మాట్లాడిన ఆడియో కలకలం రేపుతోంది.

Update: 2021-03-28 01:07 GMT

మమతా బెనర్జీ (ఫొటో ట్విట్టర్)

West Bengal Election 2021: పశ్చిమ బెంగాల్ ఎన్నికలకు ముందు తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత మమతా బెనర్జీ మాట్లాడిన ఆడియో కలకలం రేపుతోంది. ఈ ఆడియో క్లిప్‌ను బీజేపీ శనివారం సోషల్ మీడియాలో విడుదల చేసింది. నందిగ్రామ్‌కు చెందిన బీజేపీ నేత ప్రళయ్‌ పాల్‌తో మమతా బెనర్జీ మాట్లాడినట్లు తెలుస్తోంది. ఈ మేరకు మళ్లీ తృణమూల్‌ కాంగ్రెస్‌లో చేరాలని, తన విజయానికి సహకరించాలని అభ్యర్థిస్తున్నట్లుగా ఈ ఆడియోలో ఉంది.

అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్‌ అధినేత మమతా బెనర్జీ నందిగ్రామ్‌ స్థానం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదే స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా సువేందు అధికారి బరిలోకి దిగుతున్నారు. ఇద్దరూ బలమైన అభ్యర్థులే బరిలో ఉండడంతో.. అందరి దృష్టి నందిగ్రామ్‌పై పడింది. ఇదివరకు ప్రళయ్‌ పాల్‌ తృణమూల్‌ కాంగ్రెస్‌లో క్రియాశీలకంగా పనిచేశాడు. సువేందు అధికారితో కలిసి బీజేపీలో చేరాడు. ఈమేరకు ప్రళయ్‌ పాల్‌తో మమతా బెనర్జీ మాట్లాడి ప్రలోభాలకు దిగుతుందని బీజేపీ ఆరోపిస్తుంది.

'నందిగ్రామ్‌లో నేను నెగ్గడానికి సహకరించు. నీకు ఇబ్బందులు ఉన్నాయని నాకు తెలుసు. నీకు ఏం కావాలన్నా నేను చూసుకుంటా'' అని దీదీ హామీ ఇచ్చింది. దీనికి ప్రళయ్‌ పాల్‌ స్పందిస్తూ.. ''దీదీ (అక్కా) మీరు నాకు ఫోన్‌ చేశారు. అది చాలు నాకు. సువేందు అధికారికి నేను ద్రోహం చేయలేను' అని పేర్కొన్నాడు. అనంతరం ప్రళయ్ పాల్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం బీజేపీ కోసమే పనిచేస్తున్నాను, ఆ పార్టీకి, సువేందు అధికారికి ద్రోహం చేయలేనని అన్నాడు.

ఈ మేరకు బీజేపీ ప్రధాన కార్యదర్శి విజయ్‌ వర్గీయా నేతృత్వంలో బెంగాల్‌ చీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌ను కలిసింది. ఆడియో క్లిప్‌ను ఈసీ కి అందజేసింది. మరోవైపు ఈ ఆడియో క్లిప్‌ పై తృణమూల్‌ కాంగ్రెస్‌ అనుమానాలు వ్యక్తం చేసింది. ప్రళయ్‌ పాల్‌ గతంలో తమ పార్టీ నాయకుడేనని పేర్కొన్నారు. పాల్ తో మాట్లాడి, సాయం కోరితే తప్పేముందని ఆ పార్టీ నేత కునాల్‌ ప్రశ్నించారు. రాజకీయాల్లో ఇదంతా సహజమేనని, ఇలాంటి వాటిని బీజేపీ పెద్దదిగా చేసి, లాభం పొందాలని చూస్తోందని ఆరోపించారు.

Tags:    

Similar News