Ram Temple is the third-largest in the world: ప్రపంచంలో మూడవ అతిపెద్ద హిందూ ఆలయంగా.. అయోధ్య!

Update: 2020-08-05 05:07 GMT

Ram Temple is the third largest in the world: త్రేతాయుగంలో సరయూ నదీ తీరంలో జన్మించిన రామభద్రుడికి ఇన్నేళ్ల తర్వాత ఓ ఆలయం తయారుకాబోతోంది. అయోధ్యలో ఉన్న వివాదాస్పద భూమి రామయ్యేదేనని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత హిందువుల కల సాకారం కాబోతోంది. శతాబ్దాల క్రితం శత్రుమూకల చేతిలో శిథిలమైన రాముడి ఆనవాళ్లను.. అద్భుతంగా తీర్చిదిద్దే ఘడియ రానే వచ్చింది. కోదండ రాముడికి ఆయన జన్మించిన అయోధ్య నగరంలో దివ్య మందిరాన్ని నిర్మించేందుకు బుధవారం అంకురార్పణ జరగబోతోంది. ప్రపంచంలో ఎక్కడా లేనట్లుగా 5 గోపురాలతో, 69 ఎకరాల్లో 3 అంతస్థుల్లో 161 అడుగుల ఎత్తులో ఆలయం నిర్మితమవుతోంది. గర్భగుడి వద్ద వెండితో పైకప్పును ఏర్పాటు చేయనుండగా, ప్రపంచంలో మూడవ అతిపెద్ద హిందూ ఆలయంగా ఇది నిలవనుంది. ప్రస్తుతం కంబోడియాలోని అంగోకర్‌వాట్ టెంపుల్ తొలి స్థానంలో, తమిళనాడులోని తిరుచిరాపల్లి రంగనాథ స్వామి ఆలయం 2వ స్థానంలో ఉంది.

అయోధ్యలో రామాలయానికి భూమి పూజ చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఢిల్లీ విమానాశ్రయం నుంచి ప్రత్యేక జెట్ విమానంలో లక్నోకు బయలుదేరారు. 11.30గంటలకు ప్రధాని అయోధ్య చేరుకుంటారు. మొదట హనుమాన్‌గఢీ ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం 12 గంటలకు అయోధ్య రామమందిరం వద్దకు చేరుకుని 12.45గంటల వరకు రామమందిరం భూమిపూజ కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12:45 గంటలకు ప్రధాని మోదీ ప్రసంగం ఉంటుంది. 2:15 గంటలకు ప్రధాని తిరిగి ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. రామమందిరం భూమిపూజ సందర్భంగా అయోధ్యలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎస్పీజీ బలగాలు ఇప్పటికే అయోధ్యను తమ ఆధీనంలోకి తీసుకున్నాయి.


Tags:    

Similar News